ఏపీలో ఎస్మా ప్రయోగం... ఆర్నెల్లపాటు 'ప్రైవేటు' సర్కారు ఆస్పత్రులు

శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (20:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఈ రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులన్నింటికి మూలం ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌గా తేలింది. దీంతో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిని ఏపీ అధికారులు, పోలీసులు జల్లెడపడుతున్నారు. అదేసమయంలో కేసుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. 
 
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకే రోగులకు పూర్తిస్థాయిలో వైద్యం చేసేందుకు వీలుగా ప్రైవేటు ఆస్పత్రులన్నీ ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఈ మేరకు ఇటీవల జీవో జారీచేసింది. శుక్రవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సేవలను ఎస్మా పరిధిలోకి తీసుకొచ్చింది. 
 
ఈ సేవలను ఆర్నెల్లపాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ తాజాగా జీవో విడుదలచేసింది. పనిచేయడానికి నిరాకరించినవారిని శిక్షించే అధికారం ఉంటుందని జీవోలో పేర్కొంది. వైద్య పరికరాలు, మందుల కొనుగోలు, నిర్వహణ, రవాణా సిబ్బంది, వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య సేవల్లోని పారిశుద్ధ్య సిబ్బంది, అంబులెన్స్‌ సర్వీసులు ఎస్మా పరిధిలోకి తీసుకొచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 
 
మరోవైపు, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 182 ల్యాబ్లు పనిచేస్తున్నాయని ఐసీఎంఆర్ (ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్) సంస్థ వెల్లడించింది. వీటిలో 130 ప్రభుత్వ ల్యాబ్‌లని ఐసీఎంఆర్ పేర్కొంది. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 8000 శాంపిల్స్ పరీక్షించామని తెలిపింది. అటు తమిళనాడులో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 102 కేసులు నమోదు కావడంతో కరోనా పాజిటివ్ వ్యక్తుల సంఖ్య 411కి పెరిగింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు