లోకేష్ ఆ అమ్మాయిని అటు తీసుకెళ్లబోయాడు.... దూకేసింది...

సోమవారం, 19 జూన్ 2017 (16:09 IST)
ఈమధ్య కాలంలో అమ్మాయిలపై హింసాత్మక ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరులో మరో ఘటన చోటుచేసుకుంది. బీటెక్ చదవుతున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థినిని ఓ ఫైనల్ ఇయర్ విద్యార్థి లోకేష్ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత ఆమె సాహసం చేయడంతో ముప్పు తప్పింది. 
 
వివరాల్లోకి వెళితే... గుంటూరు లోని సంగడిగుంట రెడ్లబజారుకు చెందిన విద్యార్థినిని చేబ్రోలులో ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె కాలేజీకి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తుండగా తను చదివే కాలేజీకి చెందిన ఫైనల్ ఇయర్ విద్యార్థి లోకేష్ బైకుపై ఆమె వద్దకు వచ్చాడు. ఆమెను చూస్తూనే బైకు ఎక్కు అంటూ బెదిరించాడు. అతడి బెదిరింపులకు జడుసుకున్న విద్యార్థిని బైకుపై ఎక్కి కూర్చుంది. 
 
అతడు ఆమెను ఎక్కించుకుని నారాకోడూరు వరకూ వచ్చాడు. అక్కడి సెంటరుకు రాగానే విద్యార్థిని ధైర్యం చేసి అతడి బైకు పైనుంచి కిందికి దూకేసింది. ఆమె అలా దూకేయడాన్ని చూసిన స్థానికులు వెంటనే అక్కడికి వెళ్లారు. దీంతో లోకేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. విద్యార్థిని తల్లిదండ్రులు అతడిది పెదనందిపాడు అని తెలిసి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా అక్కడివారి వీరిని బెదిరించారు. ఐనా పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి