వారానికి కనీసం రెండు సచివాలయాలను తనిఖీ చేయాలి: జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు సిఎస్ ఆదేశం

గురువారం, 12 ఆగస్టు 2021 (10:02 IST)
జిల్లా కలెక్టర్లు కనీసం వారానికి రెండు సార్లు గ్రామ వార్డు సచివాలయాలను తనిఖీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ ఆదేశించారు.

గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తయినందున వీటిని మరింత సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.

కావున గ్రామ వార్డు సచివాలయాల పనితీరును జిల్లా స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సిఎస్ అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు వారానికి కనీసం రెండు సార్లు,జెసిలు, మున్సిపల్ కార్పొరేషన్లు కమీషనర్లు,సబ్ కలెక్టర్ తదితర అధికారులు వారంలో నాలుగు గ్రామ వార్డు సచివాలయాలను సందర్శించి వాటి పనితీరును పరిశీలించి అక్కడ సమస్యలు ఏమైనా ఉంటే స్వయంగా తెల్సుకుని సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.

గ్రామ వార్డు సచివాలయాలను మరింత బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు ఇంకా మరిన్ని సేవలు ఏవిధంగా అందించాలనే దానిపై క్షేత్ర స్థాయి నుండి తగిన సూచనలు సలహాలు అందించాలని కలెక్టర్లకు ఆయన సూచించారు.

డెలివరీ మెకానిజాన్ని ఇంకా మెరుగు పరచడం ద్వారా వివిధ రకాల సేవలను ప్రజలకు సకాలంలో అందేలా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ఏవిధంగా పని చేస్తోందని దేశంలోని వివిధ రాష్ట్రాలు పరిశీలన చేస్తున్నాయని కావున వీటి పనితీరును మరింత మెరుగు పర్చి మరింత ఫలవంతంగా వీటిని నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు