కేసీఆర్ పూర్వీకం ఆంధ్రా.. కేటీఆర్ జాగ్రత్తగా ఉండు... నాలుక కోస్తాం : జగ్గారెడ్డి వార్నింగ్

ఠాగూర్

శనివారం, 14 సెప్టెంబరు 2024 (16:49 IST)
భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి గట్టివార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ విద్యేషాలు రెచ్చగొట్టేందుకు భారాస కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. ఆంధ్రా, తెలంగాణా అంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిట్టినా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పల్లెత్తు మాట అన్నా నాలుకలు కోస్తామని హెచ్చరించారు. కేటీఆర్ కాదు.. ఆయన బాబు కేసీఆర్ నాలుక కూడా కోస్తామని వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలను జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. 
 
పార్టీలు మారిన నేతలకు కండువాలు కప్పే సంప్రదాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సాంప్రదాయానికి తెరలేరాపని విమర్శించారు. 2014-18 మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలు భారాసలో చేరినపుడు ఆ పార్టీ నేతలు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. పార్టీ మారిన నేతలకు కేసీఆర్ మంత్రిపదవులు కూడా ఇచ్చారని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడటంతో మాజీ సీఎం కేసీఆర్ సిద్ధహస్తుడని, కేసీఆర్ సీఎం అయిన రోజునే రాజకీయాల్లో విలువలు నశించిపోయాయని చెప్పారు. 
 
భారాస ఎమ్మెల్యేలు హరీష్ రావు, కౌశిక్ రెడ్డిలకు ఏమాత్రం సిగ్గుందా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా ప్రాంతీయతత్వాన్ని ఎందుకు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తాతలు విజయనగరం నుంచి వచ్చారని గుర్తుచేశారు. అధికారం పోయిన తర్వాత కేటీఆర్‌కు, బీఆర్ఎస్ నేతలకు ఏమి అర్థం కావడం లేదని, అందుకే రోడ్లపై పడుతున్నారని ఎద్దేవా చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు