తిరుపతిలో అమరావతి బహిరంగ స‌భ‌కు సిపిఐ (యం) డుమ్మా!

శుక్రవారం, 17 డిశెంబరు 2021 (15:36 IST)
అమ‌రావ‌తి రైతులు తిరుప‌తిలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌కు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆంధ్ర ప్రదేశ్ కమిటీ గైర్హాజ‌రు అయింది. ఆ స‌భ‌కు త‌మ‌ని ఆహ్వానించినందుకు ఆ పార్టీ నేత మ‌ధు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ, స‌భ‌కు మేం రాలేం అని లేఖ రాసి మ‌రీ చెప్పారు. అమరావతి పరిరక్షణ కమిటీ క‌న్వీన‌ర్ ఎ.శివారెడ్డి బ‌హిరంగ లేఖ రాశారు. 
 
 
తిరుపతిలో జరగనున్నసభకు మా పార్టీని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. అయితే అమరావతిలో రాజధాని నిర్మాణానికి, రాష్ట్రాభివృద్ధికి ఆటంకంగా ఉన్న బిజెపితో వేదిక పంచుకోవడానికి మేం  సిద్ధంగా లేం. అందువల్ల ఈ సభకు రాలేకపోతున్నందుకు విచారిస్తున్నాం అని స్ప‌ష్టంగా తెలిపారు.
 
 
రాజధానిని ముక్కలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం నష్టదాయకం. అమరావతి రైతు కూలీలకు, ప్రజలకు ఇచ్చిన చట్టబద్దమైన హామీలను నీరుగార్చింది. పరిపాలన, శాసన రాజధాని అమరావతిలోనే కొనసాగాలని సిపిఐ (యం) నిశ్చితాభిప్రాయం. రైతు ఉద్యమానికి గతంలో మద్దతు తెలిపాం. భవిష్యత్తులోనూ మా మద్దతు కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్ణయానికి మాకు సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. పలుసార్లు పార్లమెంటులో అమరావతిని గుర్తించడానికి నిరాకరించింది. అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయించలేదు.
 
 
 ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, పలు విషయాలలో బిజెపి దగా చేసింది. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని అమరావతి ఉద్యమ సభలకు, కార్యక్రమాలకు బిజెపిని పిలవాలనే జెఎసి వైఖరి దురదృష్టకరం. మీ ఆహ్వానం అందగానే మేము తిరుపతి సభకు హాజరు కావాలని నిర్ణయించుకున్నాము. కానీ మీరు బిజెపి నేతలను తిరుపతి సభకు ఆహ్వానించడంతో మేము విరమించుకోవాల్సి వచ్చింది. బిజెపితో కలిసి వేదిక పంచుకోలేమని తెలియజేస్తున్నాం అని పెనుమల్లి మధు స్ప‌ష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు