సీఎం జగన్ గారూ.... కరోనా వచ్చిన ఉద్యోగులను ఆదుకోండి

గురువారం, 13 మే 2021 (15:13 IST)
కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉగ్యోగులు, అధికారులు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఒక వైపు కోవిడ్ విధులు, మరోవైపు వారి వారి శాఖాపరమైన పనులతో సతమతమవుతున్నారని ఏపీ జేఏసి నాయకులు బొప్పరాజు, వైవి రావు అన్నారు.
 
వారు మాట్లాడుతూ... కరోనా సమయంలో రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తూ, కుటుంబ సభ్యులను సహితం పోగొట్టుకుంటున్న ఉద్యోగుల కనీస అవసరాల గురించి ప్రభుత్వం వెంటనే స్పందించాలి.
నెలలు గడుస్తున్నా.. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉన్నా... నేటికీ ఉద్యోగులకు వర్క్ ప్రం హోమ్,  కరోనా బారినపడ్డ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఎందుకు మంజూరు చేయడం లేదో అర్ధం కావడంలేదు. 
 
కరోనా బారినపడి రాష్ట్ర సచివాలయంలోనే ఇప్పటికే 9 మంది మరణించారు. ఇతర ప్రభుత్వ కార్యాలయాలలో వందల మంది ఉద్యోగులు చనిపోయారు. వైద్యం పొందుతున్న అనేక మంది ఉద్యోగుల ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నాయి.
 
వైద్యం కొరకు అప్పులు తెచ్చి లక్షలు ఖర్చుపెడితే.. నెలలు తరబడి ప్రభుత్వం నుండి
రావాల్సిన డబ్బులు రావడం లేదు. ఉద్యోగుల వల్ల వారి కుటుంబ సభ్యులు కూడా కరోనా బారినపడి అనేక మంది చనిపోతున్నారు. కనీసం ఏ శాఖలో ఎంతమంది ఉద్యోగులు చనిపోతున్నారో లెక్కలు కూడా తెలియడం లేదు.
 
విధినిర్వహణలో మరణిస్తున్న ఉద్యోగులు ప్రత్యేకంగా ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడకుండా ముఖ్యమంత్రి గారు భరోసా ఇస్తారని నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి తమిళనాడు తరహాలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్సగ్రేషియా ప్రకటించాలి.
 
తమ ప్రాణాలను పణంగా పెట్టి లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడుతున్న వైద్య శాఖలో ఒప్పంద ఉద్యోగి చనిపోతే.. ప్రభుత్వం నుండి ఎలాంటి రాయితీలు లేకపోవడం విచారకరం. ఒప్పంద / పొరుగు సేవల ఉద్యోగి చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఒప్పంద/పొరుగుసేవ ఉద్యోగం కల్పించాలి.
 
ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరోనా బారినపడ్డ ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రత్యేక సెలవులు తక్షణమే మంజూరు చేయాలి. ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్ విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులలో మానసిక స్థైర్యం దెబ్బతినకుండా వారికి, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యభద్రత పట్ల ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి.
 
ఉద్యోగుల సమస్యలపై సానుకూల దృక్పథంతో వున్న గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి పై విషయాలను తీసుకొని వెళ్లి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉన్నతాధికారులను కోరుతున్నాము.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు