ఏపీలో డిశంబరు 16నుండి 21 మధ్య ఉపాధ్యాయుల తుది కేటాయింపు

శనివారం, 12 డిశెంబరు 2020 (06:27 IST)
రాష్ట్రంలో త్వరలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను జవాబుదారీతనం, అవకతవలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకతతో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు.

ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను వెబ్ కౌన్సిలింగ్ విధానంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే వివిధ ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడడం జరిగిందని, వెబ్ కౌన్సిలింగ్ కు ఏవిధంగా వెసులుబాటు ఇవ్వాలనే దానిపై ఇప్పటికే ఒక డెమోను యూట్యూబ్ చానల్లో అందుబాటులో ఉంచడం జరిగిందని దానిని ఉపాధ్యాయులు వినియోగించుకుని ఆ ప్రకారం వెబ్ కౌన్సిలింగ్ కు ఆప్సన్స్ ఇవ్వాలని మంత్రి సురేశ్ విజ్ణప్తి చేశారు.
 
గత నెల 28 వతేదీ నుండి రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాకు వివరించారు. నవంబరు 30 నుండి ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను సిద్ధం చేయడం జరిగిందని దానిపై డిశంబరు 3నుండి 7వరకూ డిఇఓలకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని తెలిపామని పేర్కొన్నారు.

తదుపరి డిశంబరు 8 నుండి 10లోగా తుది జాబితాను సిద్ధం చేయాల్సిందిగా డిఇఓలకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. డిశంబరు 16నుండి 21 వరకూ ఉపాధ్యాయుల బదిలీల తుది కేటాయింపు ఉంటుందని మంత్రి సురేశ్ వెల్లడించారు.

20 శాతం హెఆచ్ఆర్ఏ ఉన్న ప్రాంతాలను కేటగిరీ-1గాను, 14.5శాతం హెచ్ఆర్ఏ ఉన్న ప్రాంతాలను కేటగిరీ-2గాను, 12శాతం హెచ్ఆర్ఏ ఉన్న ప్రాంతాలను కేటగిరీ-3గాను, 12శాతం కంటే తక్కువ హెచ్ఆర్ఏ ఉన్న ప్రాంతాలను కేటగిరీ-4గాను నాలుగు కేటగిరీలుగా విభజించి ఆప్రకారం బదిలీల ప్రక్రియను చేపట్టనున్నట్టు మంత్రి పేర్కొన్నారు.

అంతేగాక ఉపాధ్యాయుల సర్వీసును బట్టి ఏడాదికి 0.5  వంతున మార్కులు కేటాయించి ఆసర్వీసు మార్కుల ఆధారంగా బదిలీల ప్రక్రియలో ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

గిరిజన మారుమూల ప్రాంతాల పాఠశాలల్లో కూడా విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా కనీసం ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా నాలుగు కేటగిరీల్లోని ప్రాంతాల పాఠశాలలకు ఉపాధ్యాయ ఖాళీలను సర్దుబాటు చేసి బదిలీలను చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో సుమారు లక్షా 72 వేల వరకూ మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు ఉండగా వాటిలో 15వేల పోస్టులను బ్లాకు చేయడం జరుగుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈ విధంగా బ్లాకు చేసిన పోస్టులను బదిలీల ప్రక్రియ పూర్తయ్యాక మారుమూల,గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యతను ఇస్తూ రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీచేయడం జరుగుతుందని ఇది నిరంతర ప్రక్రియను చెప్పారు.

అదే విధంగా ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో వివిధ ఉపాధ్యాయ సంఘాల సూచనలు,సలహాలను అన్ని విధాలా గౌరవిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రస్తుత విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకు వచ్చేదుంకు ఉపాధ్యాయుల జీవన విధానంలో మార్పులు తీసుకువచ్చేందుక రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి ఎంతో కృత నిశ్చయంతో ఉన్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు.

అందుకే విద్యావిధానంలో అటు విద్యార్ధుల తల్లితండ్రులు,ఇటు ఉపాధ్యాయులను పూర్తిగా భాగస్వాములను చేయడం జరుగుతోందని మంత్రి సురేశ్ పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు