ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ

మంగళవారం, 15 అక్టోబరు 2019 (08:36 IST)
చిత్తూరు జిల్లా యాదమరి మండలం మొర్దానపల్లె ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. లాకర్‌లో ఉన్న 17 కేజీల బంగారం, పెట్టెలోని రూ.2.66 లక్షల నగదు అపహరణకు గురైంది.

ఈ చోరీ సోమవారం వెలుగులోకొచ్చింది. శుక్రవారం విధులు పూర్తయిన తర్వాత సిబ్బంది బ్యాంకుకు తాళాలు వేసుకుని వెళ్లారు. శని, ఆదివారం కార్యాలయానికి సెలవు. అయినప్పటికీ మేనేజర్‌ పురుషోత్తం శనివారం బ్యాంకుకు వచ్చి మధ్యాహ్నం వరకు పనిచేసి వెళ్లారు.

సోమవారం ఉదయం సిబ్బంది విధులకు హాజరుకాగా.. అప్పటికే బ్యాంకులో సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్‌డిస్క్‌ కన్పించలేదు. నగదు పెట్టెలోని రూ.2.66 లక్షలు కూడా మాయమైనట్టు నిర్ధారించారు. దీంతో మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకుకు చేరుకున్న పోలీసులకు అక్కడ చోరీ జరిగిన ఆనవాళ్లు (తాళాలు, గోడ పగులగొట్టడం వంటివి) కనిపించలేదు.

దాంతో అనుమానం వచ్చి బ్యాంకు లాకర్‌ను తెరిపించి చూడగా.. అందులోని బంగారం మొత్తం మాయమైంది. ప్రాథమిక విచారణలో రూ.3.45 కోట్లు విలువచేసే 17 కిలోల బంగారం అపహరణకు గురైనట్టు తేలినట్టు సమాచారం. బ్యాంకు మేనేజరును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఇంట్లోనూ సోదాలు చేసినట్లు తెలిసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు