పవర్ ఆఫ్ ఆర్టీఐ ... కొత్తగా మరో కాల్‌సెంటర్‌

ఆదివారం, 24 నవంబరు 2019 (15:53 IST)
రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ఫిర్యాదులు స్వీకరించేందుకు మరో కాల్‌సెంటర్‌ రాబోతుంది. ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వద్ద 1064 టోల్‌ఫ్రీ కాల్‌సెంటర్‌ ఉంది. కొన్నేళ్లుగా ఇది పనిచేస్తోంది. దీనికి అదనంగా 1100 కాల్‌ సెంటర్‌కూ అవినీతిపై ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా జగన్‌ ప్రభుత్వం మరో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి కొత్తగా 10044 అనే టోల్‌ఫ్రీ నంబర్‌ను కేటాయించారు. 
 
సోమవారం ఉదయం జగన్‌ తాడేపల్లిలోని తన నివాసం నుంచి దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పౌరసేవల్లో అవినీతిని నిరోధించేందుకు ఏసీబీ విశేషంగా కృషిచేస్తోంది. 1064 అనే టోల్‌ఫ్రీ నంబరుతోపాటు 8333995858 అనే నంబరుకు వాట్సప్‌ ద్వారానూ ఫిర్యాదులు స్వీకరిస్తోంది. టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 1100 కాల్‌సెంటర్‌కూ అవినీతిపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. 
 
ఇదిలావుండగా, అవినీతిపై యుద్ధం అంటున్న జగన్‌ ప్రభుత్వం కొత్తగా 10044 అనే టోల్‌ఫ్రీ నంబర్‌ను తీసుకొస్తోంది. ఫిర్యాదులు స్వయంగా ఇంటలిజెన్స్, ఐఏస్, ఏసీబీ అధికారి పర్యవేక్షణలో కొనసాగుతోంది. అవినీతిపై ఫిర్యాదులు రుజువైతే ప్రభుత్వ అధికారులు ఇక ఇంటికి వెళ్లాల్సిందే. ఆ దిశగా సర్కారు చర్యలు తీసుకుంటోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు