సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించిన జేపీ...ప్రభుత్వాలు అప్పు చేసి పప్పు కూడు తింటున్నాయి..

సోమవారం, 5 సెప్టెంబరు 2022 (21:48 IST)
loksatta
లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ చాలాకాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఏపీలో విద్యా, వైద్య రంగంలో నాడు-నేడు ద్వారా ఎంతో మేలు జరుగుతుందన్న జేపీ, ఇది అభినందనీయమన్నారు. విద్యా, వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ అభినందించారు.
 
విశాఖలో అందరికీ ఆరోగ్యం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో జేపీ మాట్లాడుతూ... "విద్యా, వైద్య రంగంలో ఏపీ ప్రభుత్వం మార్పులను అభినందిస్తున్నాను. విద్యా, వైద్య రంగంలో నాడు-నేడు ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. విద్యార్థుల్లో మంచి విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం చూస్తోందని జేపీ తెలిపారు. 
 
సీఎం జగన్‌ సంకల్పాన్ని అభినందిస్తున్నానని... ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థ లేకుంటే పట్టణాలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఆరోగ్యశ్రీకి ఎక్కువ డబ్బు ఖర్చుచేస్తున్న రాష్ట్రం ఏపీ. ఆరోగ్యశ్రీ ద్వారా వైఎస్సార్‌ దేశానికే ఒక మార్గం చూపారు. ఏపీలో ఫ్రీ డయాగ్నోస్టిక్‌ను బాగా అమలు చేయడం ప్రశంసనీయం' అని పేర్కొన్నారు జేపీ.
 
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వడ్డీలకే కొన్ని వేల కోట్లు చెల్లిస్తున్నారని జేపీ తెలిపారు. అప్పు చేసి ఎవరూ పప్పు కూడు తినకూడదని, ప్రభుత్వాలు అప్పు చేసి పప్పు కూడు తింటున్నాయని తప్పుబట్టారు. 
 
చాలా రాష్ట్రాల్లో ఇదే తీరు ఉందని పేర్కొన్నారు. ఒడిషాను చూసి తెలుగు రాష్ట్రాలు ఎంతో నేర్చుకోవాలని జేపీ సూచించారు. దేశంలో ఆర్థిక క్రమశిక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు