దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల తయారీ

బుధవారం, 8 ఏప్రియల్ 2020 (16:25 IST)
కరోనా నియంత్రణ చర్యలో భాగంగా దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లను తయారు చేస్తున్నామని పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వెల్లడించారు.

వెలగపూడి సచివాలయంలోని నాల్గవ బ్లాక్ ప్రచార విభాగం ఎదురుగా ఉన్న పచ్చిక ఆవరణలో పరిశ్రమలు శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ్ తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుచూపు, సలహాలు, సూచనల మేరకు పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో విశాఖ మెడ్ టెక్ జోన్ లో కరోనా నిర్ధారణ కిట్లు తయారీ చేయడం జరిగిందని వివరించారు.

ముఖ్యమంత్రి చొరవ వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ మెడిటెక్ జోన్ లో  కోవిడ్-19 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల తయారీకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అనుమతించిందన్నారు. అదే విధంగా  ప్రస్తుత విపత్తు నేపథ్యంలో వెంటిలేటర్ల తయారీకి అవసరమైన అన్ని అనుమతులకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా మినహాయింపు ఇచ్చిందన్నారు.

ప్రస్తుతానికి రోజుకు 2000 కోవిడ్-19  ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ను తయారుచేస్తున్నామని, మరో 10 రోజుల్లో రోజుకు 25 వేల కిట్లను తయారుచేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ప్రారంభించిననాటి నుండి కేవలం 35 రోజుల్లో ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్  ను తయారుచేయగలిగామని మంత్రి పేర్కొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ మైక్రోబయాలజీతో కలిసి తక్కువ ధరకే రాపిడ్ టెస్టింగ్ కిట్స్ ను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. 

ప్రస్తుత బహిరంగ మార్కెట్ లో ఈ కిట్ ధర రూ.4500 ఉండగా తాము కేవలం రూ. 1200 కే అందజేస్తున్నామన్నారు. ఇప్పటికే ఈ కిట్స్ తయారీకి 5 కంపెనీలకు అనుమతివ్వడం జరిగిందన్నారు. ర్యాపిడ్ టెస్టింగ్ కేవలం 55 నిమిషాల్లోనే ఫలితం తెలుసుకోవచ్చని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. ఒక్కో కిట్ ద్వారా రోజుకు 20 టెస్టులు చేయవచ్చని తెలిపారు. ఈ కిట్లను మొబైల్ కిట్లుగా ఎక్కడికైనా తరలించే అవకాశంఉందన్నారు.

ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా దీన్ని రూపొందించామన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా కిట్లు సరఫరా చేయాలని కోరుతున్నాయన్నారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా కిట్లు తయారుచేసిన తర్వాతే మిగతా రాష్ట్రాలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 
 
కోవిడ్-19 బాధితులకు వెంటిలేటర్ల సాయం అత్యవసరమని, అటువంటి వెంటిలేటర్ల తయారీకి కూడా రాష్ట్రంలో ప్రాధాన్యతనిస్తూ వాటిని కూడా విశాఖ మెడ్ టెక్ లో తయారీకి శ్రీకారం చుడుతున్నామన్నారు. ఈ క్రమంలో హిందుస్థాన్ లైఫ్ కేర్(హెచ్ఎల్ఎల్) సంస్థతో కలిసి ఏప్రిల్ 15 నుండి నెలకు 3000 వెంటిలేటర్లు మరియు మే చివరి నాటి 6 వేల వెంటిలేటర్లు ఉత్పత్తి చేయనున్నామని మంత్రి తెలిపారు.

కేంద్రం ఇప్పటికే 3500 వెంటిలేటర్లు కావాలని ప్రతిపాదించిన నేపథ్యంలో వాటి తయారీకి తొలిదశలో 6 కంపెనీలను ఎంపిక చేయడం జరిగిందని, అవి ఏప్రిల్ 15 నుంచి తమ కార్యకలాపాలను ప్రారంభిస్తాయని తెలిపారు. అధునాతన టెక్నాలజీ వాడటం ద్వారా ఒక్క వెంటిలేటర్ సహాయంతో ఐదు నుండి ఆరుగురుకి వినియోగించే అవకాశం త్వరలోనే అందుబాటులోకి రానుందన్నారు.
 
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రతరమైన నేపథ్యంలో పరిశ్రమ శాఖ తమ వంతు సహకారంగా 1000 టెస్టింగ్ కిట్లను ప్రభుత్వానికి అందజేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అదే విధంగా రూ. 10 లక్షల విలువ చేసే 10 వేల లీటర్ల హ్యాండ్ శానిటైజర్ ను కూడా ప్రభుత్వానికి అందజేస్తున్నట్లు తెలిపారు. ఏపీఐఐసీ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనం(5 లక్షల 4వేల 570 రూపాయలు) ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా  అందజేశారని వెల్లడించారు.
 
అత్యాధునిక వైద్యపరికరాల తయారీలో విశాఖ మెడ్ టెక్ జోన్  విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో కరోనా నియంత్రణకు విశాఖ మెడ్ టెక్ జోన్ సంస్థ ముందుకు రావడం ఎంతో అభినందనీయమన్నారు. 
 
పరిశ్రమలు శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ్ మాట్లాడుతూ, ప్రస్తుతం క్షయ వ్యాధి నిర్ధారణకు ఉపయోగించే మిషన్ లలో ఈ టెస్టింగ్ కిట్లను వినియోగించనున్నామన్నారు. రాష్ట్రంలో 230 ఈ తరహా మిషన్లు ఉన్నాయని, వాటన్నింటిని వినియోగిస్తూ ఈ కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలను నిర్వహించి 55 నిమిషాల్లోనే ఫలితాలు వెల్లడిస్తామన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు