వైకాపా అధినేత, ఏపీ అసెంబ్లీ విపక్షనేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు చెందిన 170 కోట్ల రూపాయల నగదు డిపాజిట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుంది. వీటిని తన ఖాతాలోకి మళ్లించుకుంది. జగన్ అక్రమాస్తుల కేసులో 2014 నుంచి పలు దఫాలుగా ఈడీ ఆయన కంపెనీలకు చెందిన స్థిర, చరాస్తులను జప్తు (అటాచ్మెంట్) చేసుకున్న విషయం తెల్సిందే. వీటి మొత్తం విలువ రూ.2524 కోట్లు. ఇందులో భారతీ సిమెంట్స్కు చెందిన రూ.170 కోట్ల విలువైన బ్యాంకు డిపాజిట్లు, షేర్లు ఉన్నాయి.
వాటన్నింటినీ తమ అకౌంట్లోకి బదిలీ చేస్తున్నట్లు కొద్ది రోజుల కిందటే జగన్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రం సొత్తు స్వాధీనం ప్రక్రియను పూర్తి చేసింది. వాస్తవానికి ఈడీ అటాచ్మెంట్ చేసినప్పటికీ ఆస్తులన్నీ ఆయా కంపెనీల పేరిటే ఉంటాయి. వాటిపై లావాదేవీలను కూడా నిర్వహించరాదు. రూ.170 కోట్ల నిల్వల పరిస్థితి కూడా అంతే. కానీ, అసాధారణ రీతిలో రూ.170 కోట్ల ఎఫ్డీలు, షేర్లను ఈడీ తన ఖాతాల్లోకి మళ్లించుకోవడం గమనార్హం.
ఈ విషయం తెలుసుకున్న వెంటనే జగన్ తన న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపారు. భారతీ సిమెంట్ కంపెనీ తరఫు న్యాయవాదులు శనివారం హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. అయితే, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ శనివారం అందుబాటులో లేరు. ఆయన విశాఖపట్నంలో ఉండటంతో... హౌస్ మోషన్ పిటిషన్కు అనుమతి లభించలేదు. దీంతో వాజ్యం సోమవారం హైకోర్టులో రెగ్యులర్ మోషన్లో విచారణకు రానుంది.