తమ్ముడి మీటింగ్‌లో మేల్కొన్న అన్న.. చిరంజీవితో ముద్రగడ భేటీ...

సోమవారం, 29 ఆగస్టు 2016 (12:06 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ హీరో, సొంత సోదరుడు పవన్ కళ్యాణ్ తిరుపతిలో నిర్వహించిన మీటింగ్‌తో మెగాస్టార్ చిరంజీవితో పాటు.. ఇతర కాపు నేతలు కూడా మేల్కొన్నారు. దీంతో కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాంగ్రెస్ నేత చిరంజీవితో సోమవారం సమావేశం కానున్నారు. అలాగే, మంగళవారం ప్రముఖ నిర్మాత, కాపు నేత దాసరి నారాయణ రావు ఇంట్లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను చర్చించనున్నారు. 
 
కాపు సామాజిక వర్గం కోసం రిజర్వేన్లు కల్పించాలని ముద్రగడ ఉద్యమం చేపట్టిన విషయం తెల్సిందే. ముఖ్యంగా తుని కాపుగర్జన‌తో ఈ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీతో ఆయన మిన్నకుండిపోయారు. 
 
ఈ నేపథ్యంలో కాపు వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ఇపుడు ప్రత్యేక హోదాపై పోరాడేందుకు ముందుకు వచ్చారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. దీంతో కాపు నేతలంతా మేల్కొన్నారు. ప్రత్యేక హోదాతో పాటు కాపు ఉద్యమాన్ని మరోమారు తీవ్రతరం చేసేలా వారు వ్యూహాలు రచిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత చిరంజీవితో ముద్రగడ భేటీ కానున్నారు. కాపు రిజర్వేషన్లు, ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే మంగళవారం దాసరి ఇంట్లో ముద్రగడతో పాటు కాపు సంఘానికి చెందిన ప్రముఖ నేతలు సమావేశం అవుతారని తెలిసింది. తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి