మహానాడుకు వెళ్తూ కార్యకర్త కొట్టుకెళ్లి టీ తాగిన లోకేష్

ఠాగూర్

సోమవారం, 26 మే 2025 (20:20 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఓ టీ షాపుకెళ్లి టీ సేవించారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురానికి చెందిన చెంగాచారి సాధారణ టిడిపి కార్యకర్త. గృహప్రవేశం నిమిత్తం కుప్పం వచ్చిన నారా లోకేష్‌ను కలిశాడు. చెంగాచారి బాగోగులను వాకబుచేసిన లోకేష్ మాటల్లో ఏం చేస్తుంటావని అడిగాడు. తాను తెలుగుదేశం పార్టీ వీరాభిమానినని, శాంతిపురంలో టీకొట్టు నడపుతూ జీవనం సాగిస్తున్నానని చెప్పాడు. 
 
కుప్పం నుంచి కడప మహానాడుకు బయలుదేరిన యువనేత లోకేష్ సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా టీకొట్టు వద్దకు వెళ్లాడు. అన్నా... చాలా దూరం వెళ్లాలి... టీ ఇస్తావా అని అడిగాడు. చెంగాచారికి కొద్దిసేపు నోటమాట రాలేదు. తమ అభిమాననేత నేరుగా తమ కొట్టుకురావడంతో సంభ్రమాశ్చార్యానికి లోనయ్యాడు. 
 
యువనేత లోకేష్‌‌కు టీ గ్లాసు అందించాడు. వ్యాపారం ఎలా ఉందని అడగ్గా చెంగాచారి స్పందిస్తూ... సర్... నేను 1994 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటున్నా. చంద్రబాబు గారంటే అభిమానం. నేను టిడిపికి చెందిన వాడినన్న కోపంతో గత అయిదేళ్లుగా నా టీ అంగడిని మూయించేశారు.
 
గత ఏడాది జూన్ 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక 17వ తేదీ మళ్లీ టీకొట్టు ప్రారంభించా. నాకు ఇద్దరు ఆడబిడ్డలు, ఒకబిడ్డకు పెళ్లయింది. మరో కూతురికి పెళ్లి చేయాలి. మీరు మా అంగడికి రావడం నమ్మలేక పోతున్నా చిన్నయ్యా అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. చెంగాచారి భుజం తట్టిన యువనేత లోకేష్... ఇప్పుడు నువ్వు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. నీ వెంట నేనున్నా... ఏ అవసరమొచ్చినా నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి ముందుకు సాగారు. కార్యకర్తకు యువనేత లోకేష్ ఎంతటి ప్రాధాన్యత నిస్తారనడానికి ఇదొక మచ్చుతునక. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు