రూ.87 కోట్ల ఆస్తిని రూ.11 కోట్లకే కొట్టేసిన వైకాపా నేతలు...?

బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (09:41 IST)
బ్యాంకు అధికారులతో కుమ్మక్కైన వైకాపా నేతలు రూ.87 కోట్ల ఆస్తిని కేవలం రూ.11 కోట్లకే కొట్టేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అయితే, ఈ ప్రచారాన్ని వైకాపా నేతలు కొట్టిపారేస్తున్నారు. బ్యాంకు నిర్వహించిన వేలం పాటల్లో తాము పాల్గొని, నిబంధనల ప్రకారమే దక్కించుకున్నామని అంటున్నారు. పైగా, కాలేజీ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వేలం పాటల్లో పాల్గొన్నట్టు వారు చెబుతున్నారు. 
 
పల్నాడు జిల్లాలోని అమరా ఇంజనీరింగ్ కాలేజీ ఛైర్మన్ అమరా వేంకటేశ్వర రావు కెనరా బ్యాంకులో తీసుకున్న రుణం తిరిగి చెల్లించలేక మంగళవారం పుగులు మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతి చెందిన తర్వాత కళాశాల ఆస్తి కొనుగోలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
రూ.87 కోట్ల విలువైన ఆయన ఆస్తిని వేలం బిడ్డర్లను భయపెట్టి రూ.11 కోట్లకే సొంతం చేసుకున్నారని, మృతుని కుటుంబ సభ్యులతో వైకాపా నేతలు  బేరసారాలు కొనసాగిస్తున్నారని సామాజిక మధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ డీల్‌ కుదుర్చుకోవడంలో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, విజయవాడ కెనరా బ్యాంకు ఏజీఎం విజయరామరాజులు కుమ్మక్కైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే, ఈ ప్రచారాన్ని మాత్రం వైకాపా నేతలు కొట్టిపారేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి