హృదయంలో కుళ్లు కుతంత్రాలు ఉంటే ఎముకలు కుళ్లుపోతాయ్... పవన్ వరుస ట్వీట్లు

శుక్రవారం, 9 డిశెంబరు 2022 (19:39 IST)
రాష్ట్ర పర్యటన కోసం తాను సిద్ధం చేసుకున్న వారాహి వాహనం రంగును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించిన వైకాపా నేతలకు జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తనదైనశైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ధీటుగానే సమాధానం చెబుతున్నారు. భరించలేని అసూయతో వైకాపా నేతలు రగిలిపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నానాటికీ  వైకాపా కుళ్లిపోతుందని పవన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 
 
"ఈర్ష్యతో బాధపడే విద్యార్థులు ఇతరుల వస్తువులను నాశనం చేసినపుడు మా స్కూలులో ఒక ఉపాధ్యాయుడు ఓ సూక్తిని పదేపదే చెప్పేవారు. హృదయంలో శాంతి ఉంటే ఆ దేహానికి ఆయుష్షు పెరుగుతుంది. కానీ, హృదయంలో కుళ్లు కుతంత్రాలు ఉంటే వారి ఎముకలు కుళ్ళిపోతాయి అని చెప్పేవారు" అంటూ పవన్ పేర్కొన్నారు. 
 
ఇదే వరుసలో పవన్ ఒనిడా టీవీ వాణిజ్య ప్రకటనను కూడా ప్రస్తావించారు. పొరుగువాడికి కడుపుమంట, యజమానికి గర్వకారణం అంటూ సాగే యాడ్ పిక్‌ను షేర్ చేశారు. ఈ యాడ్ నాకు చాలా ఇష్టం అని చెప్పారు. 
 
మరో ట్వీట్‌లో ఆలివ్ గ్రీన్ రంగులో ఉన్న ఓ కారు, బైక్ ఫోటోలను షేర్ చేసిన పవన్.. నియమనిబంధనలు కేవలం పవన్ కళ్యాణ్‌ కోసమే అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇంకా పచ్చని చెట్లతో కూడిన ఓ గార్డెన్ ఫోటోలను పోస్టు చేసిన పవన్.. ఇందులో మీకు ఏ రకం పచ్చదనం నచ్చింది వైసీపీ? అంటూ వెటకారం ప్రదర్శించారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు