కోనసీమ అల్లర్లు.. బ్లూ ప్రింట్ రెడీ.. 71 మంది ఆందోళనకారులు అరెస్ట్

గురువారం, 2 జూన్ 2022 (18:19 IST)
కోనసీమ అల్లర్లు తెలుగురాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేయడమే కాకుండా.. దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారాయి. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంతో తీవ్ర దుమారమే రేగింది. కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు వద్దని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలని నిరసిస్తూ భారీ విధ్వంసమే సృష్టించారు ఆందోళనకారులు. 
 
ఏకంగా మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్ళకు నిప్పంటించడంతో పాటు ఆ జిల్లా ఎస్పీతో సహా కొంతమంది పోలీసు అధికారులను గాయపరిచిన పరిస్థితి. దీంతో ప్రశాంత కోనసీమ కాస్త ప్రళయ కొనసీమగా మారింది.
 
కేవలం ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే ఇంత దారుణం జరిగిందని.. శాంతి భద్రతలను కట్టడి చేయడంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శలు వచ్చాయి.
 
ఈ విమర్శలను, జరిగిన ఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్న పోలీసు యంత్రాంగం కోనసీమ ఘటనకు పాల్పడిన వారిని జల్లెడపట్టడం ప్రారంభించింది.  దీంతో స్వల్ప వ్యవధిలోనే ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించారు పోలీసులు.
 
తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 71 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు, ఇంకా 48 మందిని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన వారిలో సగానికి పైగా గతంలో రౌడీ షీటర్లుగా ఉన్నవారిగా తేలినట్లు తెలుస్తుంది.  
 
పోలీసుల అదుపులో ఉన్న ఆందోళనకారులు ఈ ఘటనల వెనుక ఉన్నవారు ఎవరో అసలు నిజాలు చెప్పినట్లు, రాతపూర్వకంగా వాంగ్మూలం ఇచ్జినట్లు తెలుస్తుంది. జరిగిన ఘటనపై పోలీసులు ఇప్పటికే ఒక నివేదికను (బ్లూ ప్రింట్) తయారు చేసినట్లు సమాచారం.  
 
త్వరలోనే ఈ ఘటన వెనుక ఉన్న అసలు సూత్రధారులను మీడియా ముందుకు ప్రవేశపెట్టడానికి పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు