సంప్రదాయానికి భిన్నంగా సుప్రీంకోర్టులో తెలుగు వాదనలు

గురువారం, 29 జులై 2021 (11:39 IST)
దేశ అత్యున్నత న్యాయస్థామైన సుప్రీంకోర్టులో అరుదైన దృశ్యం కనిపించింది. సంప్రదాయానికి భిన్నంగా తెలుగులో వాదనలు వినిపించారు. ఇందుకోసం భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ.రమణే స్వయంగా చొరవ తీసుకోవడం గమనార్హం. తద్వారా రెండు దశాబ్దాలుగా విడిపోయిన ఓ జంటను ఆయన కలిపారు. ఈ కేసు ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టుకు వచ్చే ఏ కేసు అయినా హిందీ లేదా ఇంగ్లీషులోనే వాదనలు వినిపించాలి. కానీ, ఆ దంపతులను కలిపేందుకు తమ మాతృభాష అయిన తెలుగులోనే వాదనలు వినిపించేందుకు జస్టీస్ ఎన్వీ రమణ అనుమతి ఇవ్వడమేకాకుండా, తాను కూడా తెలుగులోనే మాట్లాడి ఈ కేసును పరిష్కరించడం హర్షణీయం. 
 
గుంటూరు జిల్లాకు చెందిన ఓ జంట విడాకులు తీసుకునేందుకు గత రెండు దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ దంపతులు చీఫ్ జస్టిస్ సూచలనతో తిరిగి కలిసి కలిసేందుకు సమ్మతించారు. ఏపీ హైకోర్టు ఆదేశాలు సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. 
 
ఈ సందర్భంగా దంపతులిద్దరితో ధర్మాసనం మాట్లాడే సమయంలో ఆంగ్లంలో మాట్లాడడానికి మహిళ ఇబ్బంది పడటం గమనించిన జస్టిస్‌ ఎన్‌వీ రమణ.. ఆమెను తెలుగులో మాట్లాడాలని సూచించారు. 'మీ భర్త జైలుకు వెళ్లడం వల్ల ఉద్యోగం, వేతనం కోల్పోతారు. అదేసమయంలో నెలానెలా వచ్చే భరణం మీరు కోల్పోతారు' అని జస్టిస్‌ ఎన్‌వీ రమణ వెల్లడించారు. 
 
సీజేఐ సూచన అనంతరం భర్తతో కలిసి ఉండడానికి ఆ మహిళ అంగీకరించారు. అనంతరం, భార్యభర్తలు ఇద్దరూ వేర్వేరుగా తామిద్దరూ కలిసి ఉంటామంటూ రెండు వారాల్లో అఫిడవిట్లు దాఖలు చేయాలని జస్టిస్‌ ఎన్‌వీ రమణ సూచించారు. ఈ దంపతులకు 1998లో వివాహం అయింది. 2001లో వేధింపులకు సంబంధించి భర్తపై క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు. 
 
ట్రయల్‌ కోర్టు 2002లో మహిళ భర్తకు 498 (ఏ) వరకట్న వేధింపులు ప్రకారం జైలు, జరిమానా విధించింది. మహిళ అత్త, మరదలకు కూడా అదే శిక్ష విధించింది. భర్త రివిజన్‌కు వెళ్లగా కోర్టు ట్రయల్‌ కోర్టు తీర్పునే సమర్థించింది. అనంతరం హైకోర్టుకు వెళ్లగా జైలు శిక్షను మినహాయిస్తూ తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు సవాల్‌ చేస్తూ ఆమె తన భర్తకు జైలు శిక్ష వేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇపుడు ఈ కేసు సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ చొరవతో సుఖాంతమైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు