పవన్‌ కళ్యాణ్‌పై ఎదురుదాడి.. మతిభ్రమించిందంటూ టీడీపీ నేతల ఫైర్

గురువారం, 15 మార్చి 2018 (10:18 IST)
తమ ప్రభుత్వంతో పాటు పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, ఏపీ ఐటీ మంత్రి పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాటలతో ఎదురుదాడి చేసేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు క్యూ కడుతున్నారు. 
 
గుంటూరు వేదికగా జరిగిన జనసేన నాలుగో ఆవిర్భావ వేడుకల్లో పవన్ కళ్యాణ్ అధికార తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో పవన్‌కు కౌంటర్ ఇచ్చేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. 
 
ఇందులోభాగంగా, గురువారం ఉదయం మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. పవన్ వ్యాఖ్యల వెనుక బీజేపీ నేతల హస్తముందని ఆరోపించారు. బీజేపీ చేతిలో ఆయన కీలుబొమ్మగా మారిపోయారని, వారు ఏం చెబితే పవన్ అది చేసే స్థితికి వచ్చేశారని నిప్పులు చెరిగారు. ఆయన మాటలు విన్న తరువాత ప్రజలకు ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని, బీజేపీ చేతిలో పవన్ పావుగా మారిపోయారని అన్నారు. 
 
పవన్ ఇచ్చిన సలహాలను తూ.చ తప్పక పాటించామని, ఎన్నికల్లో తమ వెంట నిలిచినందుకు ఆయన్ను గౌరవంగా చూస్తే, దానికి దక్కిన ప్రతిఫలం ఇదా? అని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ టీడీపీపై ఈ తరహా విమర్శలు చేయని పవన్ కు ఒక్కసారిగా ఇంత తీవ్రమైన అవినీతి ఎలా కనిపించిందని పల్లె నిప్పులు చెరిగారు. పవన్ వ్యాఖ్యల వెనకున్న మతలబేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
 
అలాగే, ఏపీ మంత్రి జవహర్ మాట్లాడుతూ, పవన్ వైకాపా అధినేత జగన్‌కు చెందిన సొంత పత్రిక సాక్షిలో వచ్చే వార్తలనే గుంటూరు బహిరంగ సభలో ఏకరవు పెట్టారంటూ విమర్శించారు. స్పష్టంగా చెప్పాలంటే ఆయనకు మతిభ్రమించినట్టుగా ఉందన్నారు. గత నాలుగేళ్లుగా కిమ్మనకుండా కూర్చొన్న పవన్ కళ్యాణ్ ఇపుడు విమర్శలు చేయడం ఏమిటని ఆయన ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు