గృహ ప్రవేశంలో భాగంగా దైవప్రవేశం, యతి ప్రవేశం, గోప్రవేశం, నివసించే వారి ప్రవేశంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రస్తుత క్యాంపు కార్యాలయానికి సమీపంలోనే నూతన అధికారిక నివాస భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతమున్న రెండు భవనాలు, కొత్తగా నిర్మించిన సీఎం అధికారిక నివాసం, క్యాంపు కార్యాలయం, సమావేశం మందిరం... ఈ అయిదు భవనాల సముదాయానికి ప్రగతి భవన్గా కేసీఆర్ సర్కారు నామకరణం చేసింది.
అలాగే, వివిధ వర్గాలతో సమాలోచనలు జరిపే సమావేశమందిరానికి జనహిత అనే పేరు పెట్టారు. జనహిత భవనంలో ప్రభుత్వ విధానాల రూపకల్పన, కార్యక్రమాల అమలు తదితర అంశాలపై రైతులు, కార్మికులు, ఉద్యోగులు, కులవృత్తుల వారు తదితర వర్గాలతో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశాలు జరుగుతాయి.
సర్వహంగులతో సీఎం క్యాంపు ఆఫీస్ సిద్ధం చేశారు. సుమారు 38 కోట్లతో నిర్మించారు. ఇక మొత్తం 9 ఎకరాల విస్తీర్ణంలో... పూర్తిగా వాస్తుకు అనుకూలంగా నిర్మించిన కొత్త క్యాంపు ఆఫీస్లో సర్వహంగులు కల్పించారు. 500 మంది అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యే విధంగా పెద్ద మీటింగ్ హాల్ను నిర్మించారు. దీంతోపాటు విజిటర్స్ బస చేసేందుకు ప్రత్యేక లాంజ్ను నిర్మించగా.. సీఎం కుటుంబ సభ్యుల వినోదం కోసం అత్యాధునిక సాంకేతిక హంగులతో మినీ థియేటర్ కూడా నిర్మించారు.
దీంతోపాటు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల అధికారులతో సీఎం కేసీఆర్ నేరుగా... వీడీయో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు నిర్వహించేందుకు కూడా ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ హాల్ను నిర్మించారు. అంతేకాదు సీఎంవో కార్యదర్శులు అందరు... ముఖ్యమంత్రికి అందుబాటులోనే ఉండే విధంగా... వారికి కూడా చాంబర్లను నిర్మించారు. ఇలా అన్ని ప్రత్యేకతలు కొత్త క్యాంపు ఆఫీస్లో హైలెట్గా నిలిచాయి. ముఖ్యంగా.. కేసీఆర్ నివాసంలో మరుగుదొడ్లు, పడక గదులకు బుల్లెట్ ఫ్రూప్ అద్దాలను అమర్చడం ఇక్కడ ప్రత్యేకత.