వెంకన్న ఆలయంలో మహా సంప్రోక్షణ క్రతువు.. కలశంలోకి శ్రీవారి శక్తి..

ఆదివారం, 12 ఆగస్టు 2018 (12:30 IST)
ఏడు కొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ క్రతువు ప్రారంభమైంది. వైఖానస ఆగమాన్ని పాటించే వైష్ణవాలయాల్లో లోక కల్యాణం కోసం ప్రతి పుష్కరానికోమారు ఈ కార్యక్రమం నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. 

1958, ఆగస్టులో విళంబినామ సంవత్సరంలో శ్రీవారి ఆలయ విమాన సంప్రోక్షణ, స్వర్ణ కవచ తాపడం జరుగగా, తిరిగి 60 సంవత్సరాల తరువాత అదే విళంబినామ సంవత్సరంలో మహాసంప్రోక్షణ జరుగుతుండటం గమనార్హం. శనివారం ఉదయం భగవంతుని అనుమతితో ఆచార్యులకు స్థాన నిర్ణయం నిర్వహించారు.
 
శనివారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ స్వామివారి సేనాధిపతి తిరుమాఢ వీధుల్లో ఊరేగారు. వసంత మండపం వద్ద పుట్టమన్ను సేకరించి తెచ్చిన రుత్వికులు, రాత్రి 9 గంటల నుంచి యాగశాలలో మహాసంప్రోక్షణ క్రతువుకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు.
 
తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో 44 మంది రుత్వికులు, వంద మంది వేద పండితులు, ధర్మగిరి వేద పాఠశాల నుంచి 20 మంది వేద విద్యార్థులు మహా సంప్రోక్షణంలో పాల్గొంటారు. ఆదివారమైన రెండో రోజు, హోమ గుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వాస్తు హోమం, రక్షా బంధనం కార్యక్రమాలు సాగనున్నాయి. 
 
కళాకర్షణలో భాగంగా గర్భాలయంతో పాటు ఆలయంలోని అన్ని ఉప ఆలయాల్లోని దేవతామూర్తుల శక్తిని కలశంలోకి ఆవాహన చేయనున్నారు. ఆపై అన్ని కలశాలను, దేవతల ఉత్సవమూర్తులను యాగశాలలోకి ఉంచి, మొత్తం 18 వేదికలపై కుంభాలను కొలువు దీరుస్తారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు