పోటీ పరీక్షల పుస్తకాలు ప్రచురిస్తాం: తెలుగు అకాడమి

శనివారం, 11 జనవరి 2020 (03:19 IST)
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని పోటీ పరీక్షలు, ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను నిపుణులైన విద్యావేత్తలతో రూపొందింపజేసేందుకు అత్యధిక ప్రాథాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర తెలుగు అకాడమి సంచాలకులు ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి చెప్పారు.

బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ ఆవరణలోని తెలుగు అకాడమీ స్టాల్‌ వద్ద శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అకాడమి ప్రచురించి 'విద్య ఉద్యోగ మార్గదర్శకత్వం' పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం తెలంగాణకు తెలుగు అకాడమి పరిమితమైందన్నారు.

రాష్ట్ర విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తెలుగు అకాడమిని మన రాష్ట్రంలో ఏర్పాటు చేశారన్నారు. ఇంటర్‌, డిగ్రీ, బీఈడీ, డీఎల్‌ఈడీ పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల పుస్తకాల ప్రచురణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

పుస్తక రచయితలు డాక్టర్‌ బి.ప్రసాద్‌బాబు, డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ ఎంతో శ్రమతో విద్య, ఉద్యోగ రంగాలకు సంబంధించిన వివరాలన్నిటినీ సేకరించి, సులభశైలిలో పుస్తకాన్ని రచించారని చెప్పారు. బిడ్డల భవితకు గురించి ఆలోచించే తల్లిదండ్రులకు సైతం ఈ పుస్తకం కరదీపికగా ఉంటుందన్నారు.

సైకాలజిస్ట్‌ డాక్టర్‌ కిలారు శ్రీనివాసరావు, జగదీష్‌, తెలుగు అకాడమి విజయవాడ కేంద్రం ఇన్‌ఛార్జ్‌ మనస్విని, రచయితలు ప్రసాద్‌బాబు, రామకృష్ణ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు