బోరున విలపించిన వైకాపా ఎమ్మెల్యే.. ఎవరు? ఎందుకు?

గురువారం, 30 జులై 2020 (16:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపాకు చెందిన ఓ శాసనసభ్యురాలు బోరున విలపించింది. ఓ పేకాట క్లబ్‌ను ఆమె నిర్వహిస్తోందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఈ విషయం ఆమె దృష్టికి వెళ్లడంతో ఆమె ఆందోళనకుగురై, బోరున విలపించింది. ఆ పేకాట క్లబ్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. ఆ ఎమ్మెల్యే పేరు ఉండవల్లి శ్రీదేవి. 
 
గుంటూరు జిల్లా నంబూరు గ్రామంలో ఓ పేకాట క్లబ్ నడుస్తోంది. ఇది వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిదేనంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఆమె స్పందించారు. ఈ పేకాట క్లబ్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పేకాట జరుగుతున్న నంబూరు గ్రామం తన నియోజకవర్గం పరిధిలోకి రాదని చెప్పారు. 
 
పక్క నియోజకవర్గంలో పేకాట జరిగితే తాడికొండ నియోజకవర్గానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ పోలీసులకు పేకాట విషయంలో ఫోన్ చేయలేదని... తనపై జరుగుతున్న కుట్రపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. 
 
పైగా, ఈ వ్యవహారంపై పూర్తి విచారణ చేపడితే వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు. మీడియా కూడా తనపై తప్పుడు  కథనాలు వేస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. మహిళా నేతను అణిచివేసే ధోరణి కాకుండా నిజాలు, ప్రజలకు చేరవేయాలని ఎమ్మెల్యే శ్రీదేవి హితవు పలికారు. ఈ విషయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి నిజాలు బరిర్గతం చేయాలని కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు