అగ్రరాజ్యం అమెరికాకు భారత్ షాకిచ్చింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే కొన్ని వస్తువుల్లో ప్రతీకార సుంకాలు విధించేందుకు భారత్ సిద్ధమైంది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రపంచ వాణిజ్యం సంస్థ దృష్టికి తీసుకెళ్లింది. భారత ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా విధించిన అధిక సుంకాలపై ప్రతి స్పందిస్తూ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కొన్ని ఎంపిక చేసిన అమెరికా ఉత్పత్తులకు ఇప్పటివరకు కల్పిస్తున్న రాయితీలను ఉపసంహరించుకోవడంతో పాటు వాటిపై దిగుమతి సుంకాలను గణనీయంగా పెంచుతున్నట్టు భారత్ డబ్ల్యూటీఓకు సమర్పించిన నివేదిక పేర్కొంది. అమెరికా తీసుకున్న ఏకపక్ష వాణిజ్య నిర్ణయాల వల్ల సుమారు 7.6 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ ఎగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని, భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అగ్రరాజ్యం అనుసరిస్తున్న ఈ రక్షణాత్మక ధోరణులను భారత్ గతంలోనే తప్పుబట్టిన విషయం తెల్సిందే.
డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక పలు దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించిన విషయం తెల్సిందే. ప్రపంచంలోనే ముడి ఉక్కు ఉత్పత్తిలో రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్పై కూడా ఈ సుంకాలు ప్రభావం గణనీయంగా పండింది. ఈ నేపథ్యంలో భారత్, తమ వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకునేందుకు డబ్ల్యూటీఓ వేదికగా ఈ అంశాన్ని బలంగా ప్రస్తావిస్తోంది.
భారత్, అమెరికా మధ్య నూతన వాణిజ్య ఒప్పందం మేరకు కుదిరేందుకు చర్చలు తుది దశకు చేరుకున్నాయని వార్తలు వస్తున్న తరుణంలో ఈ తాజా పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికాతో వాణిజ్యం లోటును తగ్గించుకునేందుకు భారత్తో ఈ ఒప్పందంలో భాగంగా పలు కీలక రాయితీలు కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేసిందని గతంలో కథనాలు వెలువడ్డాయి.