పెద్ద నోట్ల రద్దుతో వంద రూపాయల నోట్లు ఎంతగానో ఉపయోగపడ్డాయో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే కొత్త వంద రూపాయల నోట్లను చలామణిలోకి తీసుకురానున్నట్లు రిజర్వు బ్యాంకు తెలిపింది. జాతిపిత మహాత్మాగాంధీ సిరీస్-2005లో భాగంగా జారీ చేసే కొత్త నోట్లు గతంలో విడుదల చేసిన వంద రూపాయల నోట్ల తరహాలోనే ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. అయితే గతంలో జారీ చేసిన వంద రూపాయల నోట్లన్నీ చెలుబాటవుతాయని వివరించింది.
కొత్త వంద నోట్లలో అంకెలుండే భాగాల్లో ఆర్ అక్షరం, గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుందని చెప్పింది. అలాగే నోటు వెనకభాగంలో ముద్రణ సంవత్సరం 2017గా ఉంటుందని ప్రకటించింది. ఇదిలా ఉంటే.. సేవింగ్ ఖాతాల నుంచి విత్ డ్రా చేసేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న వారం పరిమితిని ఎత్తివేస్తూ త్వరలోనే ఆర్బీఐ నుంచి ప్రకటన వెలువడుతుందని కేంద్ర ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ వెల్లడించారు.
ప్రధాన మంత్రి నవంబర్ 8న ప్రకటించిన నోట్లరద్దు ప్రకటన తర్వాత 90 రోజుల్లోగానే పరిస్థితులు దాదాపు చక్కబడ్డాయన్నారు. కాగా ఈ నెల 1న కరెంటు ఖాతాల నుంచి ఏటీఎంలలో విత్డ్రా పరిమితి ఎత్తవేయడంతో ప్రజలు, చిన్నతరహా వ్యాపారులకు ఊరట లభించిందని చెప్పుకొచ్చారు.