దేశీయ కోల్ ఇండియా సంస్థ ప్లేస్మెంట్లో భాగంగా దాదాపు 631 మందిని నియమించిందని ఆ సంస్థ అధ్యక్షుడు పార్థా ఎస్. భట్టాచార్య న్యూ ఢిల్లీలో తెలిపారు. గతంలోకన్నా ఈసారి నియమించిన నియామకాల్లో రెండింతలు పెరిగాయని ఆయన తెలిపారు.
తాము ఈ ఏడాది నియమించిన ఉద్యోగుల్లో ముఖ్యంగా ఐఐటీ, ఐఐఎమ్ కళాశాలల నుంచి తీసుకున్నామని ఆయన అన్నారు. నిరుడు కంపెనీ కేవలం 343 మందిని మాత్రమే నియమించినట్లు ఆయన వెల్లడించారు.
ఇలాంటి నియామకాలలో వార్షిక వేతనాల ప్యాకేజీలు దాదాపు ఆరు లక్షల రూపాయల మేరకుంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం తమ సంస్థలో ఉద్యోగుల సంఖ్య 3.97 లక్షల మేరకుందని ఆయన అన్నారు. ఇందులో 15 వేలమంది కార్యనిర్వహణా విభాగంలోవుండగా మిగిలిన వారు గనుల తవ్వకాలకు సంబంధించిన విభాగాల్లో పనిచేస్తుంటారని ఆయన తెలిపారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తమ సంస్థలోని ఉద్యోగుల్లో పదవీ విరమణ చేసి మిగిలిన వారి సంఖ్య 3.80 లక్షల మేరకుంటుందని ఆయన అన్నారు.