జనాభా 130 కోట్లు.. కరోనా టీకా కోసం రూ.50 వేల కోట్లు : పక్కనపెట్టిన కేంద్రం!

గురువారం, 22 అక్టోబరు 2020 (19:09 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ఇపుడు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ఈ వైరస్‌కు చెక్ పెట్టేందుకు పలు దేశాలు ముమ్మరంగా టీకా తయారీల నిమగ్నమైవున్నాయి. అయితే, ఈ టీకా అందుబాటులోకి వచ్చేందుకు వచ్చే యేడాది మార్చి లేదా ఏప్రిల్ నెల కావొచ్చని భావిస్తున్నారు. 
 
ఈ క్రమంలో భారత్‌లోని మొత్తం జనాభాకు ఉచిత టీకాను అదించాలన్న యోచనలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. ఇందుకోసం రూ.50 వేల కోట్లు కేటాయించనున్నారు. ప్రస్తుతం మన దేశ జనాభా 130 కోట్లు కాగా, వీరికి ఉచిత టీకాలు వేచేందుకు రూ.50 వేల కోట్ల నిధులను కేంద్రం పక్కన ఉంచినట్టు సమాచారం.
 
ఒక వ్యక్తికి కరోనా టీకా వేసేందుకు సుమారు రూ.450 నుంచి రూ.500 వరకు ఖర్చు కావచ్చని అంచనా. ఈ నేపథ్యంలో దీనికి అవసరమ్యే నిధులను ఈ ఏడాది మార్చితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ నుంచే సమకూర్చనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 
 
మరోవైపు హిమాలయాల నుంచి అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని మారుమూల ప్రాంతాల వరకు ప్రతి ఒక్కరికి కరోనా టీకా వేయడానికి సుమారు రూ.80,000 కోట్ల నిధులు అవసరమవుతాయని సిరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ అధిపతి అదార్ పూనవల్లా అంచనా వేశారు. 
 
కరోనా వ్యాక్సిన్‌ కొనుగోలుతోపాటు రవాణా, నిల్వ చేసేందుకు శీతల వనరులు, ప్రజలకు పెద్ద ఎత్తున టీకా వేసేందుకు అవసరమైన మానవ వనరులు వంటి వాటి కోసం ఈ మేరకు నిధులు అవసరమవుతాయని చెప్పారు. 
 
దేశవ్యాప్తంగా టీకా సరఫరా అతి పెద్ద టాస్క్‌ అని అన్నారు. టీకా తొలుత అందరికీ లభ్యం కాదని, ప్రతి ఒక్కరికి చేరేందుకు ముందస్తు ప్రణాళిక అవసరమని అభిప్రాయపడ్డారు. 
 
కాగా కరోనా టీకా సిద్ధం కాగానే దేశంలోని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చేలా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం స్పష్టంచేశారు. మరోవైపు ప్రపంచ జనాభాకు అవసరమైన కరోనా వ్యాక్సిన్లను ఆకాశ మార్గంలో తరలింపు కోసం సుమారు 8 వేల రవాణా విమానాలు అవసరమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు