కేరళ రాష్ట్రంలో కొత్త వైరస్ : 13 మంది "నోరో"

శనివారం, 13 నవంబరు 2021 (09:20 IST)
కేరళ రాష్ట్రంలో మరో కొత్త వైరస్ వెలుగు చూసింది. ఇప్పటికే కరోనా వైరస్‌తో పాటు జికా వైరస్ ఆందోళనకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా మరో వైరస్ వెలుగు చూసింది. ఈ వైరస్ "నోరో"‌గా గుర్తించారు. 
 
కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌ జిల్లా పోకోడ్‌లోని ఓ పశువైద్య కళాశాలకు చెందిన 13 మంది విద్యార్థులు దీనిబారినపడ్డారు. కళాశాల ప్రాంగణం బయట.. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల్లో తొలుత ఈ వైరస్‌ బయట పడినట్లు అధికారులు తెలిపారు. 
 
అనంతరం శాంపిళ్లను అలప్పుజాలోని జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్‌ఐవీ)కు పంపించగా పలువురిలో నోరో వైరస్‌ బయటపడినట్లు చెప్పారు. చాలా సులువుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ఈ వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. 
 
మరోవైపు నోరో వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సంబంధిత పశువైద్య కళాశాల విద్యార్థుల ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. వారికి ప్రత్యేక అవగాహన తరగతిని కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. 
 
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి శుక్రవారం అధికారులతో సమావేశమై వయనాడ్‌లో పరిస్థితిని సమీక్షించారు. తాగునీటి వనరులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, బాధితులకు తగిన చికిత్స అందించడం వంటి చర్యల ద్వారా వ్యాధి త్వరలోనే అదుపులోకి వస్తుందని అధికారులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు