ఒంగోలులో ప్రైవేటు ఆస్పత్రి నిర్లక్ష్యం, మృతదేహాలు తారుమారు

మంగళవారం, 18 ఆగస్టు 2020 (16:47 IST)
ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రైవేటు ఆస్పత్రి నిర్లక్ష్యం వలన ఓ కుటుంబానికి వేదన మిగిల్చింది. ఒక కుటుంబానికి అప్పగించాల్సిన మృతదేహాన్ని మరో కుటుంబానికి అప్పగించారు. ఒంగోలు శివారు ప్రాంతంలో ఉన్న రమేష్ సంఘమిత్ర ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. కంభం ప్రాంతానికి చెందిన ఖలీల్ అహ్మద్ అనే వ్యక్తి కరోనాతో సంఘమిత్ర ఆస్పత్రిలో మరణించాడు.
 
ఆసుపత్రి వర్గాలు ఖలీల్ మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు ఆస్పత్రి వద్డకు వచ్చారు. అయితే ఖలీల్ మృతదేహానికి బదులు వీరయ్య అనే వ్యక్తి మృత దేహాన్ని ఇవ్వడంతో ఖలీల్ కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. గట్టిగా ప్రశ్నించగా ఖలీల్ మృత దేహాన్ని అంతకముందే వీరయ్య కుటుంభ సభ్యులకు ఇచ్చినట్లు వెల్లడైంది.
 
మరింత ఆరా తీస్తే వీరయ్య కుటుంబ సభ్యులు ఖలీల్ మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించేశారని తేలింది. దాంతో ఖలీల్ కుటుంబం ఎంతో వేదనకు గురైంది. తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించిన ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబం అధికారులకు విజ్ఞప్తి చేసింది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు