రెండో ట్వంటీ20లో భారత్ ఘన విజయం : లెక్క సరిపోయింది...

ఆదివారం, 14 మార్చి 2021 (23:30 IST)
అహ్మదాబాద్‌లోని మోతేరా క్రికెట్ స్టేడియంలో భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ట్వంటీ20 సిరీస్‌లో లెక్క సమానమైంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలుపొందగా, ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 164 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని కేవం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో ఏడు బంతులు మిగిలివుండగానే, భారత్ చేదిందించింది. దీంతో ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్ 1-1తో ఇరు జట్లూ సమఉజ్జీలుగా నిలిచాయి. 
 
అంతకుముందు ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్ జాసన్ రాయ్ 46, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 28 పరుగులు చేశారు. మలాన్ 24, బెయిర్ స్టో 20 పరుగులు సాధించారు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్, చహల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
 
ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్.. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా చేరకముందే ఓపెనర్ కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయింది. మొదట సున్నా పరుగులకే కేఎల్ రాహుల్ డకౌట్ అయినా.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్(56: 32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులు)తో వీర విహారం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. అతడికి కెప్టెన్ విరాట్ కోహ్లీ (నాటౌట్, 73: 49 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులు) కూడా తోడవడంతో టార్గెట్‌ ఛేజింగ్ మరింత సులభమైంది. 
 
తొలి టీ20లో డకౌట్ అయినప్పటికీ రెండో మ్యాచ్‌లో మాత్రం కోహ్లీ అదరగొట్టాడు. అజేయ అర్థ సెంచరీతో భారత్‌కు విజయాన్ని అందించాడు. వీరితో పాటు 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన రిషబ్ పంత్(26: 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) కూడా మెరుపులు మెరిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో శామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్‌లు తలో వికెట్ తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఇషాన్ కిషన్ అందుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు