వెస్టిండీస్‌తో టెస్ట్ మ్యాచ్ : జైశ్వాల్ - రోహిత్ సెంచరీలు.. భారీ స్కోరు దిశగా...

శుక్రవారం, 14 జులై 2023 (08:38 IST)
భారత క్రికెట్ జట్టు కరేబియన్ దీవుల్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో ఆతిథ్య వెస్టిండీస్‌తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఇందులో భారత జట్టు పట్టు బిగిస్తుంది. అరంగేట్ర ఆటగాడు యశస్వి జైస్వాల్ సెంచరీతో రెచ్చిపోయాడు. తన తొలి టెస్టులోనే 350 బంతులు ఎదుర్కొని 14 ఫోర్ల సాయంతో 143 పరుగులుచేశాడు. అలాగే, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 221 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 103 పరుగులు చేశారు. జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళుతుంది. ఫలితంగా రెండో ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల 312 నష్టానికి పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 162 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. యశస్వి, విరాట్ కోహ్లీ (36) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ కేవలం 150 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. 
 
కాగా, తన ఓవర్‌ నైట్ స్కోర్‌ 80/0తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టు... తొలి సెషన్‌లో నెమ్మదిగా ఆడింది. తొలి రోజు కాస్త ధాటిగా ఆడిన రోహిత్‌శర్మ, యశస్వి జైస్వాల్‌ ఓపెనింగ్ జోడీ రెండో రోజు మాత్రం ఆచితూచి బ్యాటింగ్‌ చేసింది. కరీబియన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత ఓపెనర్లు ఎక్కువ డిఫెన్స్‌కే పరిమితమయ్యారు. 
 
సింగిల్స్‌తో స్ట్రెక్‌రోటేట్ చేస్తూ వీలుచిక్కినప్పుడల్లా కొన్ని షాట్లు కొట్టి స్కోరును 100 పరుగులు దాటించారు. ఈ క్రమంలోనే అల్జారీ జోసెఫ్‌ బౌలింగ్‌లో ఓ పుల్‌ షాట్‌తో అరంగేట్ర బ్యాటర్‌ యశస్వి జైస్వాల్ 104 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. జోసెఫ్‌ బౌలింగ్‌లోనే రోహిత్‌  సిక్స్‌, ఫోర్‌ బాది ఆ తర్వాత అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో భోజన విరామ సమయానికి భారత్‌ 146/0తో బలమైన స్థితిలో నిలిచింది.
 
లంచ్‌ తర్వాత భారత ఓపెనర్లు కాస్త దూకుడు పెంచారు. యశస్వి జైస్వాల్ కొన్ని మెరుపు షాట్లు ఆడి 215 బంతుల్లో టెస్టుల్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత రోహిత్‌ కూడా 220 బంతుల్లో టెస్టుల్లో పదో శతకాన్ని సాధించాడు. సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాతి బంతికే రోహిత్‌ శర్మ పెవిలియన్‌ చేరగా.. తర్వాతి క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ (6) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి యశస్వి ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. వీరిద్దరూ నిలకడగా సింగిల్స్‌ తీస్తూ జట్టు స్కోరు 300 దాటించారు. చివరి సెషన్‌లో ఈ జోడీ 67 పరుగులు రాబట్టింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు