వైజాగ్ టెస్ట్ మ్యాచ్ : ఇంగ్లండ్‌పై భారత్ ప్రతీకారం..

ఠాగూర్

సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (14:50 IST)
వైజాగ్ వేదికగా పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. తద్వారా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. దీనికి ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. ఉప్పల్ టెస్ట్ మ్యాచ్‌లో విజయానికి కాస్త చేరువగా వచ్చిన భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ నుంచి ప్రతిఘటన ఎదురైనప్పటికీ.. కీలక సమయాల్లో వికెట్లు తీసిన భారత్‌ గెలిచి ఐదు టెస్టుల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది.
 
విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను భారత్‌ 106 పరుగుల తేడాతో చిత్తు చేసింది. భారత్ నిర్దేశించిన 399 పరుగుల లక్ష్య ఛేదనలో నాలుగో రోజు రెండో సెషన్‌లోపే ఇంగ్లండ్ 292 పరుగులకు ఆలౌటైంది. జాక్‌ క్రాలే (73) హాఫ్ సెంచరీ సాధించాడు. జస్‌ప్రీత్ బుమ్రా (3/46), రవిచంద్రన్ అశ్విన్ (3/72) అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. మూడో టెస్టు మ్యాచ్‌ ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌ వేదికగా ప్రారంభం కానుంది.
 
ఓవర్‌నైట్‌ 67/1 స్కోరుతో లక్ష్య ఛేదనను కొనసాగించిన ఇంగ్లండ్‌కు తొలి సెషన్‌లోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం ఆరంభంలో భారత బౌలర్లను కాస్త ఇబ్బంది పెట్టిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. కీలక సమయంలో వికెట్లను సమర్పించారు. మరీ ముఖ్యంగా అశ్విన్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో విజృంభించాడు. 
 
రెహాన్‌ (23)ను ఎల్బీ చేసిన అక్షర్ పటేల్ వికెట్ల పతనానికి తెరదీశాడు. కీలకమైన ఓలీ పోప్‌ (23), జో రూట్‌ (16)ను అశ్విన్‌ ఔట్ చేశాడు. పోప్‌ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా ఒడిసిపట్టాడు. లంచ్ బ్రేక్‌కు కాస్త ముందు బెయిర్‌ స్టో (26)ను బుమ్రా, జాక్‌ క్రాలేను కుల్‌దీప్‌ యాదవ్‌ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ టాప్‌ ఆర్డర్‌ కథ ముగిసింది. డీఆర్‌ఎస్‌కు వెళ్లినా బ్యాటర్లకు అనుకూలంగా ఫలితం రాలేదు. 
 
ఇంగ్లండ్ 43 ఓవర్లకు 194/6 స్కోరుతో ఉండగా.. కెప్టెన్ బెన్‌ స్టోక్స్ క్రీజ్‌లోకి వచ్చాడు. బెన్‌ ఫోక్స్‌తో కలిసి దాదాపు పది ఓవర్లపాటు వికెట్‌ ఇవ్వకుండా భారత బౌలింగ్‌ను అడ్డుకున్నాడు. అయితే, అనవసర పరుగుకు యత్నించిన బెన్ స్టోక్స్‌ను (11) శ్రేయస్‌ అయ్యర్ డైరెక్ట్‌ హిట్‌తో రనౌట్ చేశాడు. మ్యాచ్ ఆఖరులో ఫోక్స్‌ (36), హార్ట్‌లీ (36) కాసేపు పోరాడినా.. ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగారు. 
 
వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు అర్థశతక (55) భాగస్వామ్యం నిర్మించారు. దీంతో టీమ్‌ఇండియా శిబిరంలో ఆందోళన రేగింది. చివరికి వీరి జోడీని బుమ్రా విడగొట్టాడు. స్లో బంతిని సంధించి రిటర్న్ క్యాచ్‌తో ఫోక్స్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆఖరి రెండు వికెట్లను ముకేశ్‌, బుమ్రా తీసి ఇంగ్లాండ్‌ కథ ముగించారు. భారత బౌలర్లు అశ్విన్ 3, బుమ్రా 3, కుల్‌దీప్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్‌ తలో వికెట్ పడగొట్టారు.
 
స్కోరు వివరాలు: 
భారత్: తొలి ఇన్నింగ్స్‌ 396/10. రెండో ఇన్నింగ్స్‌ 255/10
ఇంగ్లాండ్‌: తొలి ఇన్నింగ్స్‌ 253/10. రెండో ఇన్నింగ్స్‌ 292/10 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు