భారత్ - బంగ్లాదేశ్ క్రికెట్ వన్డే సిరీస్ వాయిదా

ఠాగూర్

ఆదివారం, 6 జులై 2025 (15:18 IST)
భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగాల్సిన వన్డే క్రికెట్ సిరీస్ అనుకున్నట్టుగానే వాయిదా పడింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధికారికంగా వెల్లడించింది. వాస్తవానికి ఈ యేడాది బంగ్లాదేశ్ పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్‌లు ఆడాల్సివుంది. అయితే, ఈ సిరీస్ కొత్త తేదీలను ప్రకటించకపోయినా క్రికెట్ అభిమానులు ఎదురుచూసిన బంగ్లాదేశ్ పర్యటన మాత్రం వాయిదా పడింది.
 
బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ సిరీస్‌ను సెప్టెంబర్ 2026 వరకు వాయిదా వేయడానికి పరస్పరం అంగీకరించాయి. రెండు జట్ల షెడ్యూల్ సౌలభ్యాన్ని పరిగణలోకి తీసుకుని రెండు బోర్డుల మధ్య చర్చల ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సిరీస్ షెడ్యూల్‌ను తగిన సమయంలో ప్రకటిస్తామని బోర్డు వెల్లడించింది. 
 
అయితే, రాజకీయ అనిశ్చితి కారణంగా బంగ్లాదేశ్‌తో ప్రస్తుతం పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కారణంగానే ఆగస్టులో జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్‌కు భారత జట్టును పంపేందుకు కేంద్రం అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం జట్టును పంపేందుకు అనుమతి ఇవ్వలేదని సమాచారం.
 
బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొనివున్నాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ క్రికెట్ సిరీస్‌ను వాయిదా వేసింది. అయితే, వాయిదాకు గల కారణాలను మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. ప్రస్తుతానికి సిరీస్‌ను రద్దు చేయకుండా యేడాది వాయిదా వేసేందుకు బీసీసీఐ, బీసీబీ అంగీకరించినట్టు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు