ఐపీఎల్ 2025 : ముంబై ఖాతాలో మరో విజయం... ప్లేఆఫ్స్ స్థానం మరింత పదిలం

ఠాగూర్

ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (23:35 IST)
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టు ఖాతాలో మరో విజయం వరించింది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగులతో విజయం సాధించింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఆటగాళ్ళూ సూర్య కుమార్ యాదవ్, కెప్టెన్ రికెల్టన్‌లు అర్థ శతకాలతో రాణించడంతో పాటు బౌలింగ్‌లో జస్ప్రీత్ బూమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లు లక్నో జట్టు పతనాన్ని శాసించారు. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన లక్నో జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు చేసింది. 
 
భారీ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన లక్నో జట్టు ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ ఐడెన్ మార్కరమ్ (9), పూరన్ (27), రిషబ్ పంత్ (4)లు విఫలంకాగా, మిచెల్ మార్ష్ 34, ఆయుష్ బదోనీ 35 పరుగులతో ఫర్వాలేదనిపించారు. వీరిద్దరూ కాస్త పోరాటం చేసినా ముంబై బౌలర్ల ధాటికి నిలువలేకపోయారు. డేవిడ్ మిల్లర్ (24) కూడా విఫలమయ్యారు. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. చివరికి లక్నో సూపర్ జెయింట్ జట్టు 20 ఓవర్లలో 161 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 
 
ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 22 పరుగులిచ్చి నాలుగు వికెట్లు నేలకూల్చగా, ట్రెంట్ బౌల్ట్ 20 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసింది. విల్ జాక్స్ 2, కోర్బిన్ బాష్ ఒకటి చొప్పున వికెట్ తీశారు. ఈ విజయంతో ముంబై జట్టు పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. కాగా, ముంబై ఇండియన్స్‌కు ఇది వరుసగా ఐదో విజయం కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు