ఇంగ్లండ్ బయలుదేరనున్న టాలీవుడ్ అగ్రహీరోలు.. ఎందుకు?

గురువారం, 16 మే 2019 (16:20 IST)
త్వరలో ప్రారంభం కానున్న ప్రపంచకప్ క్రికెట్ పోటీలను చూసేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. 10 దేశాల మధ్య ఎంతో ఆసక్తికరంగా జరగనున్న ప్రపంచకప్ టోర్నీని లైవ్‌లో తిలకించేందుకు విక్టరీ వెంకటేష్, సూపర్‌స్టార్ మహేష్‌బాబు, నిర్మాత సురేష్ బాబుతో పాటు డా.కామినేని శ్రీనివాస్, ఎం.వెంకటేశ్వరరావు, చంద్రకుమార్‌లు కూడా వెళ్తున్నారు. వీళ్లందరూ ఛాముండేశ్వర్ నాథ్ నేతృత్వంలో ఇంగ్లండ్‌కు వెళ్తున్నారు.
 
వరల్డ్ కప్ టోర్నీ మే 30 నుండి ఇంగ్లండ్‌లో మొదలుకానుండగా జూన్ 9, జూన్ 13, జూన్ 16 తేదీల్లో భారత్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్ దేశాలతో మ్యాచ్‌లు ఆడనుంది. ఆ మ్యాచ్‌లను తిలకించేందుకు వీరు ఇంగ్లండ్ వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారట. వారం రోజులపాటు వీరందరూ అక్కడే బస చేయడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నట్లు ఛాముండేశ్వర్ నాథ్ వెల్లడించారు.
 
విక్టరీ వెంకటేష్‌కి క్రికెట్ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలో ఎక్కడ ఇండియా క్రికెట్ మ్యాచ్ జరిగినా కూడా వెంకటేష్ గారు వెళ్తుండడం గమనిస్తూనే ఉన్నాం. అలాగే మహేష్‌బాబు కూడా క్రికెట్ అంటే ఇష్టం అని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 
 
ఈ క్రమంలోనే వీరు ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట. ఈ టూర్ పూర్తయిన వెంటనే మహేష్‌బాబు అనీల్ రావిపూడితో సినిమా చేయనున్నాడు. మరోవైపు వెంకటేష్ కూడా వెంకీ మామ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు