ఆడపిల్ల పుట్టిందనీ నేలకేసి కొట్టి చంపేసిన తండ్రి.. ఎక్కడ?

మంగళవారం, 30 మే 2023 (13:23 IST)
ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో ఓ విషాదకర ఘటన జరిగింది. తనకు ఆడపిల్ల పుట్టడాన్ని జీర్ణించుకోలేని ఓ కిరాతక తండ్రి... ఆ చిన్నారిని నేలకేసి కొట్టి చంపేశాడు. మంగళగిరి మండలంలోని నవులూరు ఎంఎస్ఎస్ కాలనీకి చెందిన మునగపాటి గోపికి మూడేళ్ల క్రితం మౌనిక అనే మహిళతో వివాహమైంది. వీరికి రెండేళ్ల క్రితం లక్ష్మీపద్మావతి అనే ఆడబిడ్డ పుట్టింది. ఆరు నెలల క్రితం మరో పాపకు మౌనిక జన్మనిచ్చింది. 
 
తనకు ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని గోపి తరచుగా మద్యం సేవించి వచ్చి భార్యాబిడ్డలపై దాడికి పాల్పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న లక్ష్మీపద్మావతిని చేయిపట్టుకుని ఈడ్జి నేలకేసి కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన కుమార్తెను తల్లి మౌనిక స్థానికుల సహకారంతో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆ చిన్నారి అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తేల్చారు. అలాగే, ఇంటి వద్ద మద్యం మత్తులో ఉన్న గోపిని స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. గోపిని అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు