అప్పుడు జయను చెన్నారెడ్డి... ఇప్పుడు శశికళను విద్యాసాగర్ రావు...

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (16:09 IST)
తెలుగు నాట సంభవించే రాజకీయ సంక్షోభాలకు, తెలుగు గవర్నర్లకు విడదీయరాని సంబంధం ఉంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడు దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసు వ్యవహారంలో అప్పుడూ, ఇప్పుడూ ఇద్దరు గవర్నర్లది కీలకపాత్ర అయింది. ఆ గవర్నర్లు ఇద్దరూ తెలుగువారే, తెలంగాణవారే కావడం విశేషం. వారిలో ఒకరు మర్రి చెన్నారెడ్డి కాగా మరొకరు ప్రస్తుత ఇన్‌ఛార్జ్ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు. 
 
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై కేసు వేసేందుకు గవర్నర్ మర్రి చెన్నారెడ్డి అనుమతి ఇచ్చారంటూ ఏప్రిల్ 1, 1995లో అప్పటి జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి చెన్నైలోని తన కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. సీఎంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం దేశం రాజకీయ చరిత్రలో అదే తొలిసారి. 
 
పలు పరిణామాలు, విచారణలు తర్వాత సెప్టెంబరు 27, 2014లో అక్రమాస్తుల కేసులో జయలలిత సహా శశికళ, ఇళవరసి,  సుధాకరన్‌లకు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, జరిమానాలు విధించింది. తీర్పు వెలువడిన రోజే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జయలలితో పాటు మిగతా వారినీ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. అలా జయ జైలుకు వెళ్లడానికి అప్పటి గవర్నర్ మర్రి చెన్నారెడ్డి కారణమయ్యారు. 
 
ప్రస్తుతం నాటకీయ పరిణామాల నడుమ సీఎం పీఠం ఎక్కేందుకు సిద్ధమైన శశికళ ఆశలను, నిర్ణయాన్ని జాప్యం చేయడం ద్వారా గవర్నర్ విద్యాసాగర్‌రావు అడియాశలు చేశారు. 21 ఏళ్లపాటు పలు మలుపులు తిరిగిన అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. శశికళను దోషిగా తేలుస్తూ తీర్పుచెప్పింది. జైలు శిక్ష, జరిమానాతోపాటు, ఎన్నికల్లో 10 ఏళ్లపాటు పోటీ చేయకుండా కోర్టు నిషేధం విధించింది.

వెబ్దునియా పై చదవండి