వైట్ హౌస్‌లోకి జో బైడెన్ ఎంట్రీ.. బైబై చెప్పేస్తున్న ట్రంప్!

మంగళవారం, 19 జనవరి 2021 (22:25 IST)
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌క ముందే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వీడ్కోలు తీసుకోనున్నారు. బుధవారం వాషింగ్ట‌న్ న‌గ‌ర శివారుల్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వ‌ద్ద ట్రంప్ వీడ్కోలు కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. అక్క‌డ నుంచి ‌ఫోర్స్ వ‌న్ విమానంలో డొనాల్డ్ ట్రంప్.. ఫ్లోరిడాకు బ‌య‌లుదేరి వెళ్ల‌నున్నారు. 
 
కొత్తగా భాద్యతలు చేపట్టే వారికి వెళ్లిపోయే అధ్యక్షులు స్వహస్తాలతో లేఖ రాసే సాంప్రదాయముంది. 1989లో మొదలైన ఈ సాంప్రదాయానికి ట్రంప్‌ స్వస్తి చెప్పనున్నారు. మరోవైపు.. యూఎస్‌ క్యాపిటల్‌ కాంప్లెక్స్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఈ కాంప్లెక్స్‌ సమీపంలో అగ్నిప్రమాదం జరగడంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. 
 
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణస్వీకారం చేయడానికి ఒకరోజు ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ విభాగం స్పందించింది. జాగ్రత్త చర్యల్లో భాగంగా క్యాపిటల్‌ కాంప్లెక్స్‌ మూసివేయాలని నిర్ణయించామని.. ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని వెల్లడించింది.
 
మరోవైపు.. అమెరికా ఉపాధ్య‌క్షురాలిగా ఎన్నికైన డెమోక్రాట్ నేత క‌మ‌లా హ‌ర్రీస్ త‌న సెనెట‌ర్ ప‌ద‌వికి అధికారికంగా రాజీనామా చేశారు. అమెరికాలోని ఎగువ‌స‌భ సెనెట్‌లో ఆమె ప‌ద‌వీ కాలం కూడా ముగిసింది. బుధవారం దేశ అధ్య‌క్షుడిగా జో బైడెన్‌తోపాటు ఉపాధ్య‌క్షురాలిగా ఆమె ప్ర‌మాణం చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే అమెరికా ఉపాధ్య‌క్షురాలిగా ఎన్నికైన తొలి న‌ల్ల జాతీయురాలు, తొలి ద‌క్షిణాసియా మ‌హిళ‌గా కూడా క‌మ‌లా హ‌ర్రీస్ రికార్డు నెల‌కొల్ప‌నున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు