అమెరికా అధ్యక్ష ఎన్నికలు వచ్చే నెలలో జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు తన వ్యక్తిగత ఈ-మెయిల్ సర్వర్ నుంచి చట్టవిరుద్ధంగా అధికారిక కార్యకలాపాలు నిర్వహించారంటూ వచ్చిన ఆరోపణలపై మళ్లీ దర్యాప్తు చేయాల్సిందిగా అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నిర్ణయించింది. సరిగ్గా మరో పది రోజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న తరుణంలో ఈమెయిల్ స్కాంపై దర్యాప్తుకు ఎఫ్.బి.ఐ నిర్ణయించడంపై ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి ఈ ఈమెయిల్ స్కామ్పై గతంలో దర్యాప్తు జరిపిన ఎఫ్.బి.ఐ.. ఈ స్కామ్లో ఆమెను ప్రాసిక్యూట్ చేయనవసరం లేదని తెలిపింది. ఇప్పుడు వేరే కేసులో దర్యాప్తు జరుపుతుండగా.. ఈ-మెయిల్స్ స్కాంలో మరికొన్ని ఆధారాలు వెలుగు చూశాయి. దీంతో పునర్విచారణకు ఎఫ్బీఐ నిర్ణయించింది. దీనిపై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తంచేశారు.