నేను హీరోను కాదు.. మనమందరం మనుషలం: కన్సాస్‌ ఘటనపై గ్రిల్లాట్

శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (13:53 IST)
అమెరికాలో వలసదారులకు రక్షణ కరువైంది. జాత్యహంకార ఘటనలు పెచ్చరిల్లిపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసా రద్దు నిర్ణయంతో అమెరికాలోని వలసదారులతో పాటు భారతీయులకు ముచ్చెమటలు పడుతున్నాయి. తాజాగా అమెరికాలోని ఓ బార్‌లో తెలుగు యువకులపై కాల్పులు జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. 
 
అమెరికాలోని కన్సాస్ నగరంలోని ఓ బార్లో యూఎస్ నేవీ మాజీ అధికారి ఆడమ్‌ పురింటన్‌‌ని ఓ అమెరికన్ అడ్డుకుని అందరితో హీరో అనిపించుకుంటున్నాడు. బార్లో ఇద్దరు యువకులపై జరిపిన కాల్పుల ఘటనలో శ్రీనివాస్ అనే వ్యక్తి మరణించగా.. అలోక్ అనే మరో యువకుడు గాయపడ్డాడు. ఈ ఘటనలో అమెరికన్ వ్యక్తి అయాన్ గ్రిల్లాట్ ప్రాణాలు తెగించి.. నిందితుడి నుంచి ఇద్దరు తెలుగు యువకులను కాపాడేందుకు ప్రయత్నించాడు. 
 
ఆడమ్‌ పురింటన్‌ అనే వ్యక్తి శ్రీనివాస్‌, అలోక్‌పై ‘మా దేశం విడిచి వెళ్లిపోండి’ అని గట్టిగా అరుస్తూ కాల్పులకు తెగబడటంతో గ్రిల్లాట్ అడ్డుకున్నాడు. అతడి నుంచి తుపాకీ లాగేసే యత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో గ్రిల్లాట్‌ చేతి, ఛాతిలో బుల్లెట్‌ గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడికి ప్రాణాపాయమేమీ లేదని వైద్యులు వెల్లడించారు. అయితే తనను అందరూ హీరోను చేయొద్దన్నాడు. ఆ సమయంలో ఎవరైనా చేయాల్సిన పనే తాను చేశానని చెప్పాడు. కాల్పులు జరిపిన వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో చూడాల్సిన సమయం కాదని.. మనమందరం మనుషులమని గుర్తించాలని చెప్పాడు. 
 
కాల్పుల్లో గాయాలతో బయటపడ్డ అలోక్‌ తనను గురువారం ఆస్పత్రికి వచ్చి కలిసినట్లు గ్రిల్లాట్‌ తెలిపాడు ఈ ఘటనలో అలోక్ ప్రాణాలతో బయటపడటం ఎంతో సంతోషమని.. ఆయన భార్య ఐదు నెలల గర్భవతి అని చెప్పాడు. అయితే మరో స్నేహితుడు ప్రాణాలు కోల్పోవడం మాత్రం చాలా బాధాకరమని చెప్పుకొచ్చాడు. 51 ఏళ్ల వ్యక్తి ఇలా కాల్పులకు తెగబడటం దారుణమని గ్రిల్లాట్ వ్యాఖ్యానించాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా పోలీసులకు అందించడం జరిగిందన్నాడు. 

వెబ్దునియా పై చదవండి