మరోమారు అంతరిక్షంలోకి వెళ్లనున్న సునీతా విలియమ్స్

ఠాగూర్

సోమవారం, 6 మే 2024 (09:36 IST)
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మరోమారు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఈ నెల 7వ తేదీన కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి బోయింగ్ స్టార్‌లైనర్‌ ద్వారా ప్రయాణం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 8.34 గంటలకు ఈ ప్రయోగం మొదలుకానుంది. దీనిపై ఆమె స్పందిస్తూ, మళ్లీ ఇంటికి వెళుతున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. 
 
ఈ ప్రయాణంపై ఆమె స్పందిస్తూ, ఈసారి కాస్త ఆందోళనగా ఉన్నప్పటికీ అయితే ప్రయాణంపై అంత భయం లేదన్నారు. లాంచ్ ప్యాడ్ వద్ద శిక్షణ సమయంలో ఆమె ఈ మేరకు మాట్లాడారు. మరోసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించడం సొంత ఇంటికి తిరిగి వెళ్తున్నట్టుగా అనిపిస్తోందన్నారు. కాగా వ్యోమగామి బుచ్ విల్మెర్‌తో కలిసి ఆమె ఈ ప్రయాణం చేయనున్నారు. ఈ అంతరిక్షయానంతో హ్యుమన్ రేటెడ్ అంతరిక్ష నౌక ద్వారా ప్రయాణించనున్న తొలి మహిళగా సునీత విలియమ్స్ నిలవనున్నారు. 
 
కాగా గతంలో ఆమె 2006, 2012లలో రెండుసార్లు అంతరిక్షానికి వెళ్లారు. మొత్తం 322 రోజులు ఆమె అంతరిక్షంలో గడిప చరిత్ర సృష్టించారు. అత్యధికంగా 50 గంటల 40 నిమిషాలపాటు 'స్పేస్ వాక్' చేసిన మహిళగా కూడా ఆమె రికార్డు సృష్టించారు. మొత్తం 10 స్పేస్వాక్ ద్వారా ఆమె ఈ ఘనత సాధించారని నాసా గణాంకాలు చెబుతున్నాయి. కాగా సునీతా విలియమ్స్ తండ్రి డాక్టర్ దీపక్ పాండ్యా, తల్లి బోనీ పాంద్యా దంపతులు గుజరాత్కు చెందినవారనే విషయం తెలిసిందే. అంతరిక్ష కేంద్రంలో సమోసాలు తినడానికి ఇష్టపడతానని గతంలో ఆమె పలుమార్లు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు