మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఠాగూర్

శుక్రవారం, 28 మార్చి 2025 (16:41 IST)
మయన్మార్ దేశంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ  భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 7.7తీవ్రతగా నమోదైంది. ఈ భూకంపం ధాటికి మయన్నార్ దేశం చిగురుటాకులా వణికిపోయింది. భారీ భవంతులు నేలమట్టమయ్యాయి. ఈ భూకంపం ధాటికి మయన్మార్‌లో 25 మంది మృతి చెందారు. భారీ భవనాలు నేలమట్టం కాగా, శిథిలాల కింద కొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. పలువురికి గాయాలయ్యాయి. 
 
అటు మయన్మార్ రాజధాని నేపిడాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భూ ప్రకంపనల ప్రభావంతో మాండలే నగరంలో ఐకానిక్ వంతెన కూలిపోయింది. దేశంలో పలు చోట్ల ఎత్తయిన ప్రార్థనా మందిరాలు, గోపురాలు నేలకొరిగాయి. భూకంపం నేపథ్యంలో మయన్మార్ సైనిక్ ప్రభుత్వం అంతర్జాతీయ సమాజం సాయం కోరింది. మానవతా దృక్పథంతో సాయం అందించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. 
 
మరోవైపు, థాయిలాండ్‌‍లో భారతీయుల సహాయార్థం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. భూకంపం ప్రభావానికి గురైన భారతీయులు ఈ హెల్ప్ లైన్ సేవలు వినియోగించుకోవాలని థాయిలాండ్‌లోని భారత ఎంబసీ కోరింది. థాయిలాండ్‌లోని భారతీయ ఎంబసీ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్లు +66 618 819 218
 
మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు
 
మయన్మార్‌ దేశంలో శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటల ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది. ఒక్కసారిగా భారీభూకంపం రావడంతో పెద్దపెద్ద బహుళ అంతస్తు భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తమ నివాసాలు, కార్యాలయాలను వదిలి ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన ఒళ్ళు గగుర్పొడిచే వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
ఇక భూకంప కేంద్రం సాగింగ్ నగరానికి వాయువ్యంగా 16 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే, ఈ భారీ భూకంపం వల్ల జరిగిన ప్రాణనష్టం వివరాలు తెలియాల్సివుంది. 
 
ఇక ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో కూడా తీవ్ర ప్రకంపనలు కనిపించాయి. దీంతో అక్కడ కొన్ని మెట్రో, ఇతర రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే, చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయని బీజింగ్ భూకంప కేంద్రం వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు