భారత్‌లో ఉగ్రదాడులకు పాక్ భారీ ప్లాన్.. ఖలీస్థాన్ నేతలతో కీలక భేటీ

మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (15:34 IST)
భారత్‌లో ఉగ్రవాద దాడులకు పాకిస్థాన్ భారీ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం స్వదేశంలో ఉన్న ఖలీస్థాన్ తీవ్రవాద సంస్థలకు చెందిన అగ్ర నేతలతో మంగళవారం కీలక సమావేశం నిర్వహించినట్టు భారత నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ఈ సమావేశంలో జైషే, లష్కర్, హిజ్బుల్, ఖలిస్థాన్ జిందాబాద్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన అగ్రనేతలు పాల్గొన్నట్టు సమాచారం. 
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టడం, ఆ రాష్ట్రంలో అమలు చేస్తూ వచ్చిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం వంటి చర్యలను పాకిస్థాన్ జీర్ణించుకోలేక పోతోంది. ఈ చర్యలకు ప్రతీకారం తీర్చుకునేలా, భారత్‌లో భారీ విధ్వంసానికి పాల్పడేలా ఉగ్రమూకలను ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి భారత్‌లోకి చొచ్చుకువచ్చేలా ప్రోత్సహిస్తోంది. ఈ చొరబాట్లను భారత బలగాలు పూర్తిగా తిప్పికొడుతున్నాయి. 
 
దీంతో పాకిస్థాన్ తన పంథాను మార్చుకుంది. జైషే, లష్కర్, హిజ్బుల్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులనుకాకుండా స్వదేశీయంగా ఉన్న ఖలీస్థాన్ ఉగ్రవాదులతో విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేసింది. ఇందులోభాగంగా, ఉగ్రవాద సంస్థలకు చెందిన అగ్రనేతలతో పాకిస్థాన్ నేతలు సమావేశమైనట్టు భారత నిఘా వర్గాలు కనిపెట్టాయి. 
 
ఈ పరిస్థితుల్లో ఐఎస్ఐ నిర్వహించిన సమావేశంపై కీలక వివరాలు సేకరించిన ఇంటెలిజెన్స్, ఈ సమావేశంలో భారత్‌పై ఎలా దాడులు చేయాలన్న విషయంపైనే చర్చ జరిగిందని వెల్లడించింది. ఇస్లామాబాద్‌లోని ఓ రహస్య ప్రదేశంలో మీటింగ్ జరిగిందని పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు