ఐరాసలో ఉగ్రవాదులను వెనకేసుకొచ్చారు.. పనామా గండం.. నవాజ్ షరీఫ్‌పై అనర్హత వేటు..

ఆదివారం, 2 అక్టోబరు 2016 (11:33 IST)
పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌పై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. పనామా పేపర్స్ లీకేజీల ఆధారంగా అసెంబ్లీ రూల్స్‌లోని 62,63 నిబంధనలను అనుసరించి నవాజ్‌ షరీఫ్‌ జాతీయ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దుచేసి, అనర్హుడిగా ప్రకటించాలని ప్రతిపక్ష పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌(పీటీఐ) పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించింది. 
 
ఐరాస వంటి అంతర్జాతీయ వేదికపై టెర్రరిస్టు బుర్హాన్ వనీని కీర్తించడంతో పాటు యూరీ దాడి కాశ్మీర్‌ ఆందోళనలకు కొనసాగింపని ఉగ్రవాదులను వెనకేసుకొచ్చిన నవాజ్ షరీఫ్‌పై అవినీతి ఆరోపణలు కూడా అనర్హత వేటుకు కారణమయ్యేలా ఉన్నాయి. కొన్ని నెలల కిందట ప్రకంపనలు సృష్టించిన పనామా పేపర్స్  వ్యవహారంలో నవాజ్‌ షరీఫ్‌ పేరు ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. 
 
విదేశీ కంపెనీల ముసుగులో వేల కోట్ల అక్రమ సంపాదనను పోగేసుకున్నవారి జాబితాలో షరీఫ్‌ పేరు పైవరుసలో కనిపించింది. దీంతో పాటు యూరీ ఘటన, కాశ్మీర్‌ ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి వంటి అంశాలను లక్ష్యంగా తీసుకుని షరీఫ్‌పై వేటు వేసేందుకు ప్రతిపక్షాలు పక్కా ప్లాన్ చేస్తున్నాయి. ఆ క్రమంలోనే పీటీఐ సభ్యులు ఆగస్టు 15న అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సిద్దిఖీకి ఒక నివేదిక సమర్పించారు. అందులో షరీఫ్ అక్రమ ఆస్తులు, ఇతర ఆర్థిక నేరాల చిట్టాలను పొందుపర్చారు.
 
కాగా, ఆ నివేదికను జాతీయ అసెంబ్లీ స్పీకర్ అయాస్ సిద్దిఖీ శనివారం పాకిస్థాన్ ఎలక్షన్ కమిషన్‌కు పంపారు. ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాన్ని బట్టి నవాజ్ రాజకీయ భవితవ్యం ఉడబోతోంది. అయితే విచారణ జరపకుండా నవాజ్ పై వేటు వేసే అవకాశమేలేదని, ప్రతిపక్షాలవి తప్పుడు ఆరోపణలని అధికార పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ వ్యాఖ్యానించింది.

వెబ్దునియా పై చదవండి