వాష్టింగన్ రెస్టారెంట్ వద్ద భారతీయుడిపై దాడి... తీవ్రంగా గాయపడి మృతి

ఠాగూర్

శనివారం, 10 ఫిబ్రవరి 2024 (11:23 IST)
అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యేడాది జనవరి నెల ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడులు, అనుమానాస్పద ఘటనల్లో ఏకంగా ఆరుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో భారతీయుడిపై దాడు జరిగింది. వాషింగ్టన్ రెస్టారెంట్ వద్ద జరిగిన ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వివేక్ అనే వ్యక్తి చనిపోయాడు. మృతుడుని వర్జీనియాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ దాడి ఈ నెల రెండో తేదీన జరగరింది. బాధితుడిని కిందపడేసిన నిందితుడు ఆపై తలను నేలకేసి బాదాడు. దీంతో వివేక్ తీవ్రంగా గాయపడ్డాడు. 
 
41 ఏళ్ల తనేజా అర్థరాత్రి రెండు గంటలు దాటాక రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి వీధిలోంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటన వెనకున్న కారణమేంటన్నది తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి బాధితుడు స్పృహ కోల్పోయి పడివున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తనేజా గురువారం ప్రాణాలు విడిచాడు.
 
దీనిపై అమెరికా పోలీసులు కేసు నమోదు చేసి ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు. నిందితుడికి సంబంధించిన వివరాలు చెప్పిన వారికి 25 వేల డాలర్ల బహుమతి ప్రకటించారు. ఈ వారం ఆరంభంలో షికాగోలో హైదరాబాద్‌ నగరానికి చెందిన ఐటీ విద్యార్థి సయ్యద్ ముజాహిద్ అలీపై దాడిచేసి దుండగులు దోచుకున్నారు. అమెరికాలో ఇప్పటికే శ్రేయాస్ రెడ్డి బెనిగెర్ (19), నీల్ ఆచార్య, వివేక్ సైనీ (25), అకుల్ ధావన్ మృతి చెందారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు