ఆఫ్గనిస్థాన్లో మరో ఘాతుకం జరిగింది. ఒక ఇంజనీరింగ్ కంపెనీలో పని చేస్తున్న ఆరుగురు భారతీయులతో పాటు.. 18 మందిని తాలిబన్ తీవ్రవాదులు హతమార్చారు. భారత్కు చెందిన ఒక నిర్మాణ కంపెనీపై తాలిబాన్ తీవ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో వీరు మృత్యువాత పడినట్టు పాకిస్థాన్ టీవీ ఛానల్ ఒకటి తెలిపింది.
శుక్రవారం రాత్రి జరిపిన ఈ దాడికి ఆఫ్గన్ కేంద్రంగా పని చేసే తీవ్రవాదులు బాధ్యత వహిస్తూ, దాడులకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ను కూడా విడుదల చేశారు. కాగా, ఈ దాడిలో మరో 20 మంది గాయపడ్డారు. పక్తియా ప్రావియన్స్లో ఈ దాడి జరిగింది. దీనిపై స్థానిక పోలీసులు మాట్లాడుతూ.. దాడిలో ఆరుగురు భారతీయులతో పాటు.. పది మంది తాలిబన్ తీవ్రవాదులు హతమైనట్టు చెప్పారు.
అయితే, దీనిపై ఇంతవరకు అధికారిక సమాచారం వెల్లడికాలేదు. కాగా, ఈ భారతీయ నిర్మాణ్ సంస్థ ముస్లిం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందువల్లే ఈ దాడికి పాల్పడినట్టు పేరు వెల్లడించని తీవ్రవాద సంస్థ ప్రతినిధి తెలిపాడు.