రిలయన్స్ జియో నుంచి రానున్న స్మార్ట్ ఫోన్లు ఇవే...

సోమవారం, 15 ఆగస్టు 2022 (18:20 IST)
రిలయన్స్ జియో త్వరలోనే 5జీ సేవలను ప్రారంభించనుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే సెప్టెంబరు నెలాఖరులో జియో 5 జీ సేవలను అందుబాటులోకి రావొచ్చు. ఇందుకు అనుగుణంగా ఆ సంస్థ 5జీ స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టనుంది. 
 
ఈ ఏడాది లోపు 5జీ ఫోన్ తీసుకువచ్చేందుకు జియో సన్నాహాలు చేస్తోంది. వీలైతే దసరాకే కొత్త ఫోన్ తీసుకురావాలని భావిస్తోంది. ఇది ఐదు రకాల 5జీ బ్యాండ్స్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని ధర కూడా పలు వర్గాలకు అందుబాటులో ఉండేలా దృష్టిసారించింది. రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఉండొచ్చని ఓ అంచనా. 
 
ఇకపోతే, ఫీచర్స్ విషయంలో జియో ఎక్కడా రాజీపడడంలేదు. ఇందులో ఇన్ ప్లేన్ స్విచింగ్ (ఐపీఎస్) ఎల్సీడీ డిస్ ప్లే ఏర్పాటు చేయడం విశేషం. దీని స్క్రీన్ సైజు 6.5 అంగుళాలు. ఇందులో మొత్తం 3 కెమెరాలు ఉన్నాయి. మెరుగైన భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఏర్పాటు చేశారు. 
 
వెనుక భాగంలో ప్రైమరీ కెమెరా (13 ఎంపీ)తో పాటు 2 ఎంపీ కెమెరా, ముందు భాగంలో 8 ఎంపీ కెమెరా ఇస్తున్నట్టు సమాచారం. జియో 5జీ ఫోన్ లో 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీతో ఓ వేరియంట్ ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఇది ప్రగతి ఓఎస్‌తో పని చేస్తుంది. ప్రగతి ఓఎస్‌ను జియో సంస్థ గూగుల్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది. వేగవంతమైన కార్యకలాపాల కోసం స్నాప్ డ్రాగన్ 480 5జీ ప్రాసెసర్‌ను పొందుపరిచినట్టు టెక్ నిపుణులు చెబుతున్నారు. 
 
ఇందులో సుదీర్ఘమైన పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. జియో నెక్ట్స్ ఫీచర్ ఫోన్ తరహాలోనే ఇందులో జియో యాప్స్ ఉచితం. గూగుల్ యాప్స్ కూడా ఫోన్‌తో పాటే లభిస్తాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు