లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన అన్నాడీఎంకే... రీఎంట్రీకి ఆసన్నమైందంటున్న శశికళ!

వరుణ్

సోమవారం, 17 జూన్ 2024 (11:28 IST)
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీ అయిన అన్నాడీఎంకే చిత్తుగా ఓడిపోయింది. పలు పార్టీలతో కలిసి ఆ పార్టీ పోటీ చేసినప్పటికీ తమిళనాడు, పుదుచ్చేరిలోని 40 లోక్‌సభ స్థానాల్లో ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేక పోయింది. దీంతో ఆ పార్టీ నేతలు డీలా పడిపోయారు. అదేసమయంలో త్వరలో జరుగనున్న విక్రవాండి అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయరాదని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఒకపుడు ఆ పార్టీలో చక్రం తిప్పిన శశికళ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే పార్టీలోకి తన రీఎంట్రీకి సరైన సమయం ఆసన్నమైందని, పార్టీలోకి తన పునఃప్రవేశం మొదలైందని ఆమె అన్నారు.
 
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాజయంతో ఏఐఏడీఎంకే పతనం అవుతుందని భావించాల్సిన అవసరం లేదని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అమ్మ పాలనను తీసుకొస్తానని శిశికళ శపథం చేశారు. ప్రతిపక్ష నేత హోదాలో ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని అడగాల్సిన ప్రశ్నలు అడగడంలేదని, ఇకపై ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రభుత్వాన్ని తాను ప్రశ్నిస్తానని ఆమె అన్నారు. ఈ మేరకు ఆదివారం తన మద్దతుదారులతో జరిగిన కార్యక్రమంలో శశికళ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
'నేను మీకు చెబుతున్న సమయం వచ్చింది. ఎటువంటి ఆందోళన అవసరం లేదు. తమిళనాడు ప్రజలు మన వైపే ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నారు. ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను. అన్నాడీఎంకే కథ ముగిసిందని అనుకోవద్దు. నా రీ-ఎంట్రీ ప్రారంభమైంది' అని ఆమె అన్నారు. పార్టీని ఏకీకృతం చేయాలనే తన వైఖరిని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు