భారత్ ప్రతీకారం... 9 మంది పాకిస్థాన్ సైనికులు హతం

గురువారం, 24 నవంబరు 2016 (08:19 IST)
భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్‌ బలగాలు మంగళవారం జరిపిన కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లు మరణించారు. వారిలో ఒకరి మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరకడాన్ని భారతసైన్యం తీవ్రంగా పరిగణించింది. దెబ్బకుదెబ్బ తీసింది. 
 
పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని సైనిక పోస్టుల పోస్టులపై కౌంటర్‌ ఎటాక్‌ చేసింది. భారీ స్థాయిలో గుళ్ల వర్షం కురిపించింది. 120 ఎంఎం మోర్టార్లు, మిషన్‌గన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో తొమ్మిది మంది పాకిస్థాన్ జవాన్లు హతమయ్యారు. వీరిలో కెప్టెన్‌ స్థాయి అధికారి కూడా ఉండటం గమనార్హం. 
 
అయితే భారత కాల్పుల్లో తమ సైనికులు ముగ్గురే మరణించారని పాకిస్థాన్ బుకాయిస్తోంది. మరో పదిమంది సాధారణ పౌరులు మరణించారని పేర్కొంది. భారత సైన్యం ప్రయోగించిన షెల్స్‌ ఓ ప్రైవేట్‌ బస్సు, అంబులెన్స్‌పై పడ్డాయని ఈ ఘటనలో పదిమంది మరణించారని పేర్కొంది. కవ్వింపు చర్యలు లేకుండానే భారత బలగాలు కాల్పులకు దిగాయని ఆరోపించింది. 

వెబ్దునియా పై చదవండి