ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కుటుంబ సభ్యుల గృహ నిర్బంధం... ఎందుకు?

ఠాగూర్

శుక్రవారం, 22 మార్చి 2024 (17:46 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది. కాగా, కేజ్రీవాల్ అభ్యర్థన మేరకు ఆయన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించి, ఇందుకోసం ప్రత్యేకంగా త్రిసభ్య ధర్మాసనం కూడా ఏర్పాటు చేస్తున్నట్టు సీజేఐ చంద్రచూడ్ వెల్లడించారు. అయితే, ఈ విచారణ.. ట్రయల్‌ కోర్టులో రిమాండ్‌ ప్రొసీడింగ్స్‌తో క్లాష్‌ అవుతుందని సీఎం తరపు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని కోరారు. ట్రయల్‌ కోర్టు తీర్పునకు అనుగుణంగా మరో పిటిషన్‌తో సుప్రీంను ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఈ పరిణామాల అనంతరం కేజ్రీవాల్‌ను ప్రత్యేక కోర్టు ఎదుట అధికారులు హాజరుపర్చారు.
 
ఇదిలావుంటే, కేజ్రీవాల్ కుటుంబసభ్యులను గృహ నిర్బంధంలో ఉంచినట్లు ఢిల్లీ మంత్రి గోపాల్‌ రాయ్‌ ఆరోపించారు. శుక్రవారం ఉదయం కేజ్రీవాల్‌ నివాసానికి మంత్రి వెళ్లగా ఆయనను లోనికి వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సీఎం అరెస్టయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు. ఇంట్లో వృద్ధ తల్లిదండ్రులున్నారు. వారందరినీ కలిసి ఓదార్చేందుకు, ధైర్యం చెప్పేందుకు మమ్మల్ని లోపలికి అనుమతించట్లేదు. ఏ చట్టం కింద వారిని గృహ నిర్బంధంలో ఉంచారు? తప్పుడు కేసులో సీఎంను శిక్షిస్తున్నారు సరే.. ఆయన వృద్ధ తల్లిదండ్రులు, పిల్లలపై కేంద్రానికి ఎందుకింత కక్ష?' అని గోపాల్‌ రాయ్‌ మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు